AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ టీచర్స్ ను ఆదుకున్న విద్యార్థి

విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికి విలవిలలాడుతున్నారు. కరోనా కష్ట కాలంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి 5వ తరగతి విద్యార్థిని కలచివేసింది. తమ చదువులు చెప్పిన టీచర్లను ఆదుకోవాలనుకున్నాడు. వెంటనే తన తండ్రికి చెప్పి వారికి నిత్యావసర సరుకులు అందించేలా చేశాడు.

ప్రైవేట్ టీచర్స్ ను ఆదుకున్న విద్యార్థి
Balaraju Goud
|

Updated on: Aug 10, 2020 | 4:17 PM

Share

కరోనా మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కటేమిటి అన్ని వర్గాలపై కొవిడ్‌-19 తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ప్రతి వ్యక్తి జీవన శైలినే మార్చివేసింది. కరోనా రాకాసి బతుకు చిత్రాన్నే మార్చేసింది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులైన ఉపాధ్యాయులు కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికి విలవిలలాడుతున్నారు. కరోనా కష్ట కాలంలో తనకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసి 5వ తరగతి విద్యార్థిని కలచివేసింది. తమ చదువులు చెప్పిన టీచర్లను ఆదుకోవాలనుకున్నాడు. వెంటనే తన తండ్రికి చెప్పి వారికి నిత్యావసర సరుకులు అందించేలా చేశాడు.

నల్లగొండ జిల్లా హాలియాలోని అక్షయ హై స్కూల్ లాక్ డౌన్ కారణంగా మూతపడింది. దీంతో ఉపాధ్యాయులు ఇంటికే పరిమితమయ్యారు. పాఠశాల యాజమాన్యం ఆదాయం లేక సరిగా జీతాలు కూడా ఇవ్వలేకపోతుంది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఎక్కలూరి సాయి సాత్విక్ రెడ్డికి విషయం తెలిసింది. ఉపాధ్యాయులకు ఎంతో కొంత సాయం అందించాలనుకున్నాడు. దీంతో తన తండ్రి హాలియా మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ అయిన ఎక్కలూరి శ్రీనివాస్ రెడ్డికి వివరించాడు. దీంతో కొడుకు ఆలోచనను మెచ్చకున్న శ్రీనివాస్ రెడ్డి ఇందుకు అంగీకరించాడు. పాఠశాలలోని 21 మంది ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కేజీల రైస్, కిరాణా సామాగ్రి, శానిటైజర్ తో పాటు మాస్కులు అందించారు.

నేటికీ పాఠశాలలు పునఃప్రారంభం కానందున ప్రైవేట్ టీచర్స్ మనుగడను దృష్టిలో ఉంచుకొని తన కుమారుని కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు శ్రీనివాస్ రెడ్డి. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలోని ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీచర్స్ ను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.