ఇవాళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలుపై చర్చ
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
త్వరలో మొదలు కానున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంపై వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రుల అభిప్రాయాలను స్వీకరించి పకడ్బందీగా అమలు చేసేందుకు విస్తృతంగా చర్చించనున్నారు.
కరోనా టీకా పంపిణీలో భాగంగా ఇప్పటికీ అయా రాష్ట్రాలకు కేంద్రం కోవిడ్ వ్యక్సిన్ సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యాక్సిన్ సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో భేటీ అవుతుండడం ఇదే తొలిసారి.
వ్యాక్సినేషన్ సన్నద్ధతలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు దఫాలు డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్కు ప్రభుత్వం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. తొలి విడతలో భాగంగా కోటి మంది ఆరోగ్య సిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలి డోసు ఇస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అంటే, కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న 27 కోట్ల మందికి ముందుగా టీకా అందనుంది.