వాషింగ్టన్: అంగారక గ్రహం(మార్స్)పై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఆపర్చ్యునిటీ రోవర్ కథ ముగిసిపోయింది. 15 సంవత్సరాలుగా అంగారక గ్రహానికి సంబంధించిన అనే సంకేతాలను భూమికి పంపిన ఈ రోవర్.. గతేడాది జూన్లో భారీ ధూళి తుఫానులో చిక్కుకుంది. ఆ తరువాత సంకేతాలు ఆగిపోగా.. రోవర్ను పునరుద్ధరించేందుకు వెయ్యికిపైగా కమాండ్లు ఇచ్చారు. చివరగా మంగళవారం నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోని అంతరిక్ష వాహకనౌక కార్యకలాపాల కేంద్రం శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆపర్చ్యునిటీ రోవర్ కథ ముగిసిందని నాసా అధికారికంగా ప్రకటించింది.
రోవర్కు అమర్చిన సోలార్ ప్యానెల్లపై పెద్ద ఎత్తున ధూళి పేరుకుపోయి బ్యాటరీలు ఛార్జ్ అవడానికి అవకాశం లేనందునే పనిచేయడం ఆగిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చివరగా ఈ రోవర్ నుంచి గతేడాది జూన్ పదో తేదిన సంకేతాలు అందాయి. కాగా ఆపర్చ్యునిటీ స్థానంలో కొత్త రోవర్ను 2020కల్లా సిద్ధం చేస్తామని నాసా ప్రతినిధులు ప్రకటించారు.
అయితే 90 అంగారక రోజులు, వెయ్యి మీటర్ల ప్రయాణమే లక్ష్యంగా ఈ రోవర్ను శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపైకి పంపారు. అయితే అంచనాలకు మించి సేవలందించిన ఆపర్చ్యునిటీ సుమారు 45కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. అంగారక గ్రహంపై ఒకప్పుడు నీరు ఉండేదని, మానవుల మనుగడకు అక్కడ అవకాశాలు ఉన్నాయని ఈ రోవర్ సంకేతాలు పంపింది. అంగారగ గ్రహంకు సంబంధించి ఈ రోవర్ దాదాపు 2,00,000 ఫొటోలను భూమికి చేరవేసింది.