దుబ్బాకలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కవుః హరీష్ రావు
దుబ్బాక ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం రాయపోల్ మండలం ఎల్కల్, బేగంపేట గ్రామాల్లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దుబ్బాక ఉప ఎన్నికలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం రాయపోల్ మండలం ఎల్కల్, బేగంపేట గ్రామాల్లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక అభివృద్ధికి అహర్నిశలు కృషీ చేసిన స్వర్గీయ రామలింగారెడ్డి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు గుండెల్లో గుబులు పుట్టిందన్నారు. ఈ ఎన్నికలో ఆ కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. రాయపోల్ను మండల కేంద్రం చేసిన కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎల్కల్, బేగంపేట గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.
బావుల వద్ద మీటర్లు బిగించే బీజేపీకి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. ఆ రెండు పార్టీల వల్ల దుబ్బాకకు ఒరిగిందేమీలేదన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. రాష్ర్టంలో సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ను ఇస్తున్నాం. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నాం. బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. నవంబర్ 3వ తేదీన సోలిపేట సుజాత రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు.