Breaking News : లొంగిపోనున్న మావోయిస్ట్ అగ్రనేత గణపతి..!

మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన అనుయాయులకు, ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి...

Breaking News : లొంగిపోనున్న మావోయిస్ట్ అగ్రనేత గణపతి..!
Follow us

|

Updated on: Sep 01, 2020 | 2:34 PM

Maoist leader Ganapathi likely to surrender : మావోయిస్టు పార్టీ అగ్రనేత, మాజీ కార్యదర్శి గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన అనుయాయులకు, ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. 74 ఏళ్ల గణపతి ( 2017) గత మూడేళ్ల క్రితమే అనారోగ్య కారణాల వల్ల పార్టీ ఉన్నత పదవి నుంచి తప్పుకొన్నాడు.

ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం వంటి సమస్యలతో గత రెండేళ్లుగా బాధపడుతున్నాడు. గణపతిని ప్రస్తుతం మోసుకుని తీసుకెళ్తున్నారు. ఈ స్థితిలో లొంగిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందక తప్పదని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది.

గణపతి లొంగుబాటును సాఫీగా జరిగేలా చేసేందుకు తెలంగాణ పోలీసులు చొరవ తీసుకుంటున్నారని, ఈ విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఓకే అన్నట్లుగా  తెలుస్తోంది. ఇతనితోపాటు మరికొందరు ప్రముఖ మావోయిస్టు సీనియర్ లీడర్లు లొంగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే పెద్ద సంచలనంగా మారనుంది. మావోయిస్టు సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించిన నాయకుడిగా గణపతికి పేరుంది.

గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు స్వగ్రామం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌ ఆయన స్వగ్రామం. ముప్పాళ్ల గోపాల్‌రావు-శేషమ్మ దంపతులకు 1945లో లక్ష్మణరావు జన్మించారు. ముప్పాళ్ల లక్ష్మణ్ రావు కుటుంబంలో రెండో సంతానం. ఆయనకు 1973లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఇదే జిల్లాలోని రుద్రంగిలో పని చేస్తుండగా 1975లో బీఈడీ సీటు రావడంతో వరంగల్‌ వెళ్లారు. అక్కడ ఆర్ఎస్‌యూ(RSU) తో సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే, ఆ తర్వాత నక్సలైటు ఉద్యమంపై ఆకర్షితులై పీపుల్స్‌వార్‌లో చేరారు. 1977లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌ జిల్లా తపాల్‌పూర్‌లో పితంబర్‌రావు హత్య కేసులో కొండపల్లి సీతారామయ్యతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 1977లో తొలిసారి ఆయనపై కేసు నమోదైంది.

జగిత్యాల జైత్రయాత్ర కోసం చందాలు వసూలు చేశారనే కేసు, ఉప్పుమడిగె రాజేశ్వర్‌రావు, చిన్నమెట్‌పల్లి జగన్మోహన్‌రావు హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి. కరీంనగర్‌లో బెయిల్‌ తీసుకుని పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1990-91లో పీపుల్స్‌వార్‌లో చీలికలు రావడంతో 2005లో ఏర్పడిన మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

సుదీర్ఘకాలంపాటు ఆ పదవిలో కొనసాగిన గణపతి తలకు ప్రభుత్వం రెండు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న గణపతి స్థానంలో నంబాల కేశవరావును పార్టీ నియమించింది. గణపతికి భార్య విజయ, కుమారుడు వాసుదేవరావు ఉన్నారు.