‘శుచి’ పథకానికి నిధులు నిలిపివేసిన కర్ణాటక సర్కార్
పాఠశాల బాలికలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బాలికల రుతుస్రావం పరిశుభ్రత ప్రాజెక్టు అయిన ‘శుచి’ పథకానికి ఈ ఏడాది నిధుల కేటాయింపులు నిలిపివేసింది.
పాఠశాల బాలికలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బాలికల రుతుస్రావం పరిశుభ్రత ప్రాజెక్టు అయిన ‘శుచి’ పథకానికి ఈ ఏడాది నిధుల కేటాయింపులు నిలిపివేసింది.. బాలికలకు ముఖ్యమైన పరిశుభ్రత పథకం కింద శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ సంబంధించి నిధులను నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 17 లక్షలకు పైగా బాలికలను ప్రభావితం చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్-19 తొలి కేసు వెలుగుచూసిన నాటి నుంచి నిధులను నిలిపివేస్తూ ముఖ్యమంత్రి యడీయూరప్ప నిర్ణయం తీసుకున్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థినిలు నెలసరి సమయంలో వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శుచి పథకాన్ని తీసుకువచ్చింది. విద్యార్థులకు పరిశుభ్రత పథకం కింద శానిటరీ న్యాప్కిన్ల పంపిణీ చేసింది. ఇందు కోసం 2013-14లో ప్రారంభమైన ఈ పథకానికి మొదట్లో కేంద్రం స్పాన్సర్ గా వ్యవహరించింది. ఇందుకు సంబంధించిన నిధులను కేంద్రమే కేటాయించింది. 2015-16 నుండి ఈ పథకాన్ని చేపట్టాలని రాష్ట్రాలను కోరింది కేంద్రం. దీంతో ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తూ వస్తుంది. ఈ పథకానికి ₹ 49 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది కర్ణాటక సర్కార్. దీని గురించి అవగాహన కలిగించడం దీని లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలలో కూడా పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపడుతోంది.
అయితే, శుచి పథకం ఆగిపోయిందని అధికారులు సైతం వెల్లడించారు. ఇదే విషయాన్ని రాష్ట్రీయ బాలికల శుచీ పథకం ఇన్ఛార్జ్, స్వస్త్య కార్యక్రమ విభాగం డిప్యూటీ డైరెక్టర్ వి.వీణ స్పష్టం చేశారు. నిధులను కోరుతూ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను సమర్పించడం జరిగిందని.. ఈ పథకాన్ని నిలిపివేయడం కౌమారదశలో ఉన్న బాలికలను దెబ్బతీసిందని మాకు తెలుసు.. దాన్ని పునఃప్రారంభించే పనిలో ఉన్నామన్నారు వీణా. ఈ సంవత్సరం ఆరోగ్య శాఖకు మొత్తం బడ్జెట్ గ్రాంట్లు తగ్గాయని అందుకే ఈ పథకానికి నిధుల కేటాయింపు జరుగలేదని రాష్ట్ర ఆరోగ్య డైరెక్టర్ ఓం ప్రకాష్ ఆర్.పాటిల్ తెలిపారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఈ పథకం త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.