ఆసీస్ను వారి గడ్డపై కొట్టడం అంత ఈజీ కాదు.. అడిలైడ్ తొలిటెస్ట్పై వేణుగోపాల్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
డిసెంబర్ 17 (గురువారం) నుంచి ఇండియా - ఆస్ట్రేలియాల మధ్య తొలిటెస్ట్ మ్యాచ్ అడిలైడ్లో జరగనున్న విషయం తెలిసిందే. 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్కు సర్వం సిద్ధమైంది.
Venugopalrao interesting comments on Adelaide test: ఇండియా – ఆస్ట్రేలియాల మధ్య తొలిటెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 17 (గురువారం) నుంచి అడిలైడ్లో జరగనున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో తొలిసారిగా భారత్ డే అండ్ నైట్ మ్యాచ్లో ఆడబోతుండడంతో మ్యాచ్పై ఆసక్తి పెరుగుతోంది. 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్కు సర్వం సిద్ధమైంది. వన్డే సిరీస్ లో భారత్ పరాజయం, టీ20లో విజయం తర్వాత జరుగుతోన్న మ్యాచ్ కావడంతో అందరి దృష్టి టెస్ట్ క్రికెట్ పై పడింది. ఈ మ్యాచ్ గురించి తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు టీవీ9తో పలు విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా వేణుగోపాలరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆసీస్కు టీం ఇండియా గట్టి పోటీనిస్తుంది. వార్నర్, స్మిత్ ఆసీస్ జట్టులో లేకపోవడం కూడా తొలి టెస్ట్పై ప్రభావాన్ని చూపుతుంది. పింక్ బాల్ క్రికెట్ రసవత్తరంగా ఉంటుంది. స్వింగ్, బౌన్స్ కూడా బౌలర్లకు కలిసొస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. షమీ, బుమ్రా లాంటి అనుభవం గల బౌలర్లు టీమిండియాలో ఉన్నారని తెలిపారు. సహనంగా అన్ని విభాగాల్లో ఎవరు రాణిస్తారో వారినే విజయం వరిస్తుందని వేణుగోపాల్ చెప్పారు.
టీమిండియా అన్ని విభాగాలపై దృష్టిసారించాలని, టెస్ట్ క్రికెట్లో క్రీడాకారులు రాణించడంతో పాటు సహనం కూడా ఉండాలని సూచించారు. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఓడించడం అంత సులభమైన విషయం కాదని.. కానీ ఇటీవల జరుగుతోన్న పరిస్థితులు టీమిండియాకు కలిసొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి మ్యాచ్లో గెలిచే జట్టుపై సిరీస్ ప్రభావం ఉంటుందని, అది జట్టులో విశ్వాసాన్ని పెంపొదించేందుకు దోహద పడుతుందని వేణుగోపాల రావు అభిప్రాయపడ్డారు.