AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad city buses: గ్రేటర్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఇక అన్నీ రూట్లలో తిరుగనున్న సిటీ బస్సులు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సిటీ బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Hyderabad city buses: గ్రేటర్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఇక అన్నీ రూట్లలో తిరుగనున్న సిటీ బస్సులు
Balaraju Goud
|

Updated on: Jan 02, 2021 | 8:06 AM

Share

కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతుంది. సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయి బస్సులను తిప్పాలని భావిస్తున్నారు అధికారులు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సిటీ బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌లో 60శాతం సిటీ బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. భారీ గండిపడ్డ ఆదాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆర్టీసీ రెఢీ అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో బస్సులను రోడ్డెక్కించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.

కరోనాకు ముందు గ్రేటర్ హైదరాబాద్‌ పరిథిలో ప్రతి రోజూ ఆర్టీసీ బస్సుల్లో 33 లక్షల మంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేరవేసింది. లాక్‌డౌన్‌తో 4 నెలల పాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మూడు నెలల నుంచి 60శాతం బస్సులను మాత్రమే నడుపుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో 2,750 ఆర్టీసీ బస్సులు ఉండగా.. సుమారు 1650 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ప్రతిరోజూ 16 -17 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే, విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో అనుకున్న స్థాయిలో ప్రయాణకుల సంఖ్య పెరగలేదు. కానీ, గత రెండు వారాలుగా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో బస్సుల సంఖ్యను అదేస్థాయిలో పెంచాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇక, సంక్రాంతి తర్వాత ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో 20వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సేవలందించేందుకు గ్రేటర్‌ ఆర్టీసీ ఫ్లాన్ చేస్తోంది. బస్సుల సంఖ్య పెరిగితే ప్రయాణికులు పెరిగే అవకాశాలున్నా నష్టాల నేపథ్యంలో ఆర్టీసీ దృష్టి సారించలేకపోయింది. రద్దీ రూట్లలో బస్సుల సంఖ్య పెంచడంతో పాటు రూట్ల సంఖ్య పెంచుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వ సహకారంతో వెయ్యి కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయాణికుల సంఖ్యను 40 లక్షలకు చేరుకునేలా, అలాగే ఆదాయాన్ని కూడా పెంచుకోవడం దిశగా చర్యలు చేపడుతోంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఆర్టీసీ అడుగులు వేస్తోంది.