AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు..!

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని తిస్సా–బైరాగఢ్ రహదారిపై శనివారం (ఆగస్టు 08) ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. చలుజ్ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం తీవ్రతతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు..!
Chamba Road Accident
Balaraju Goud
|

Updated on: Aug 08, 2026 | 10:47 AM

Share

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని తిస్సా–బైరాగఢ్ రహదారిపై శనివారం (ఆగస్టు 08) ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. చలుజ్ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం తీవ్రతతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. బైరాగఢ్ నుంచి చంబా జిల్లా వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు చలుజ్ మోర్ సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఘటన సమయంలో బస్సులో సుమారు 15 నుంచి 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురిలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా మృతుల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బస్సు రహదారి నుంచి అదుపుతప్పిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. ప్రమాదానికి అతివేగమా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమా, రహదారి పరిస్థితులా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే భారీ శబ్దం విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు స్థానికులు పోలీసులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసు సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదంలో గాయపడిన 11 మంది ప్రయాణికులను తిస్సా సివిల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆసుపత్రులకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సు ప్రమాదానికి గురైన తీరును పరిశీలించడంతో పాటు డ్రైవర్‌కు సంబంధించిన వివరాలు, వాహనం పరిస్థితి, రహదారి పరిస్థితులు, ప్రయాణికుల వాంగ్మూలాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనను తిస్సా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్‌హెచ్‌ఓ అనుభవ్ శర్మ ధృవీకరించారు. ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల్లో ప్రమాదకర మలుపులు, ఇరుకైన రహదారుల కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఘటన మరోసారి ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us