పల్నాడులో హైటెన్షన్… నేతల హౌస్ అరెస్టులు… ఏం జరుగుతోంది…?

గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఇరు పార్టీల నిరసనలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పల్నాడు, గుంటూరులో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించారు. అన్ని వైపులా, పోలీసులు మోహరించారు. మీడియాని కూడా అనుమతించడం లేదు. ఇక జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు, పలువురు టీడీపీ […]

పల్నాడులో హైటెన్షన్... నేతల హౌస్ అరెస్టులు... ఏం జరుగుతోంది...?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 11, 2019 | 3:19 PM

గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఇరు పార్టీల నిరసనలకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పల్నాడు, గుంటూరులో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించారు. అన్ని వైపులా, పోలీసులు మోహరించారు. మీడియాని కూడా అనుమతించడం లేదు. ఇక జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు, పలువురు టీడీపీ నాయకులను బైండోవర్ చేశారు. మరోపక్క వైసీపీ, చలో ఆత్మకూరు ప్రకటించిన నేపథ్యంలో పోలీసు నుండి అనుమతి రాకపోవడంతో, వైసీపీ నేతలు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. ‘చలో ఆత్మకూరు’కు వెళ్లకుండా ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. దీంతో నివాసంలోనే చంద్రబాబు నిరాహార దీక్షకు దిగారు. రాత్రి 8వరకూ దీక్షను కొనసాగించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.  ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ను ఆయన నివాసం వద్ద అడ్డుకోవడంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘చలో ఆత్మకూరు’కు వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు తెదేపా నేతలు, కార్యకర్తలను నిలవరిస్తున్నారు.

కోసంచలో ఆత్మకూరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ తరలివెళ్లారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకీ, దేవినేని అవినాష్‌కి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలతో కలిసి రోడ్డు పైన బైఠాయించి అవినాష్ ఆందోళనకు దిగారు. దీంతో అవినాష్‌ని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆత్మకూరులో పాల్గొనే అవకాశం ఉన్న ప్రకాశం జిల్లా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, ఎం. అశోక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చలో ఆత్మకూరుకు అనుమతి లేదని నేతలకు తెలిపారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా సత్తెన పల్లిలో కూడా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. చలో ఆత్మకూరు కార్యక్రమం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 17 మంది టీడీపీ నేతలకు సత్తెనపల్లి పట్టణ పోలీసులు బైండోవర్ నోటీసలు ఇచ్చారు.

గుంటూరు జిల్లాలో ‘చలో ఆత్మకూరు’కు అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ, వైసీపీ పోటాపోటీగా అనుమతి కోరాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపులతో తమ కార్యకర్తలు, అభిమానులను ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తుండగా.. టీడీపీ హయాంలో తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలుత టీడీపీ ‘చలో ఆత్మకూరు’ పేరిట నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. టీడీపీకి పోటీగా వైసీపీ కూడా ఆత్మకూరు వెళ్తామంటూ ప్రకటించింది. దీంతో ఇరు పార్టీల నేతలూ అనుమతి కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. టీడీపీ తరఫున మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, మద్దాలి గిరిధర్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మిని కలిసి అనుమతివ్వాలని కోరారు. మరోవైపు, వైసీపీ నేతలు గుంటూరు రేంజ్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కలిశారు. ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, నందిగం సురేశ్‌ ఐజీని కలిసి చలో ఆత్మకూరుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

చలో ఆత్మకూరు విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా కార్యక్రమం ఆగదని తేల్చి చెప్పారు. వైసీపీ దాడులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. చలో ఆత్మకూరు బాధితులకు భరోసా తప్ప.. యుద్ధం కాదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక జరిగిన దాడులపై రెండు పుస్తకాలను విడుదల చేశారు. ఆ పుస్తకాల్లో దాడులు, కేసుల వివరాలను పొందుపరిచారు. మంగళవారం సాయంత్రం గుంటూరు పార్టీ కార్యాలయంలో మాట్లాడిన బాబు వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు.

ఏపీలో అరాచక పాలనకు చరమగీతం పాడేందుకే ఈ పోరాటం చేస్తున్నానన్నారు చంద్రబాబు. అప్రజాస్వామిక పాలనపై రాజీలేని పోరాటం చేస్తామని.. కార్యకర్తలకు అండగా నిలబడతామన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవాళ్లను హోంమంత్రి పెయిడ్‌ ఆర్టిస్టులంటూ ఎగతాళి చేయడం దారుణమన్నారు. బాధితులను అవమానించినందుకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు పెయిడ్‌ ఆర్టిస్టులు.. ఎవరు మొసలి కన్నీరు కారుస్తున్నారు.. అధికారం ఉందని ఇష్టానుసారం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జగన్‌, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.