ఏపీలో ప్రభుత్వ భవనాలకు వేసేవి ఈ రంగులే
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ వైసీపీ రంగులేస్తున్నారంటూ చెలరేగిన రచ్చకు శాశ్వతంగా తెరదించేందుకు సిద్దమైంది జగన్ ప్రభుత్వం. ఈ విషయంలో ఇకపై విపక్షానికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వవద్దని తలపెట్టింది. అందుకు తగిన విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఎలాంటి రంగులు వేయాలనే దానిపై కొత్త మార్గదర్శకాలను సిద్దం చేసింది.

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ వైసీపీ రంగులేస్తున్నారంటూ చెలరేగిన రచ్చకు శాశ్వతంగా తెరదించేందుకు సిద్దమైంది జగన్ ప్రభుత్వం. ఈ విషయంలో ఇకపై విపక్షానికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వవద్దని తలపెట్టింది. అందుకు తగిన విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఎలాంటి రంగులు వేయాలనే దానిపై కొత్త మార్గదర్శకాలను సిద్దం చేసింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాలు, పంచాయితీ కార్యాలయాలకు, ఇతర కట్టడాలకు వేసే రంగుల విషయంలో మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ మార్గదర్శకాలను రూపొందించారు. గ్రామ పంచాయితీ కార్యాలయాలకు మట్టి రంగుతో పాటు తెలుపు, నీలం, ఆకుపచ్చని రంగులు వేయాల్సిందిగా సూచించారు.
గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా నాలుగు రంగులకు అర్ధాలు చెబుతూ ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. మట్టిని సూచిస్తూ టెర్రకోట రంగు, పాడి పంటలకు సూచనగా ఆకుపచ్చ, నీలి విప్లవానికి సూచనగా నీలం రంగు, పాల విప్లవానికి సూచనగా తెలుపు రంగులు వేయాల్సిందిగా సూచనలు చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన కట్టడాలు, భవనాలకు జాతీయ బిల్డింగ్ కోడ్ మేరకు ఈ రంగులు వేయాల్సిందిగా సూచనలు.
ప్రభుత్వ భవనాలపై ఏ రాజకీయ పార్టీకి చెందిన చిహ్నాలు, రంగులు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ప్రభుత్వ విభాగం, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించిన రంగును ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంచుకోవాలని స్పష్టం చేసింది ప్రభుత్వం.




