
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్ఫాలియాలో ఓ కబేళాకి చెందిన 730 మంది సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో గిటరహ్ స్లో జిల్లాలోని టోనీస్ గ్రూప్ మీట్ ప్యాకింగ్ ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. ఇందుకు సంబంధించిన కాంటాక్ట్ ఆధారంగా మొత్తం 7 వేల మందిని క్వారంటైన్లో ఉంచారు. అలాగే ఈ నెల 29 వ తేదీ వరకు స్కూళ్లు, డేకేర్ కేంద్రాలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మరో 5 వేల మందికి పైగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు ఈ ప్లాంటులో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందిందనే దానిపై ఎన్ఆర్డబ్ల్యూ ప్రభుత్వం విచారణ చేపట్టింది. గత నెల ఇదే రాష్ట్రంలోని కోస్ఫెల్డ్ జిల్లాకి చెందిన మరో మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్లో 200 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు.