Covid 19: కరోనా దెబ్బకి.. కార్ల కంపెనీల విలవిల..!
కరోనావైరస్ ధాటికి ప్రపంచం అతలాకుతలమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. చాలా రంగాలు కోవిద్ 19 వైరస్ దెబ్బకి చతికిలపడ్డాయి. వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Covid 19: కరోనావైరస్ ధాటికి ప్రపంచం అతలాకుతలమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. చాలా రంగాలు కోవిద్ 19 వైరస్ దెబ్బకి చతికిలపడ్డాయి. వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా వీటి జాబితాలోకి వచ్చి చేరింది. వాహన తయారీ కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి. దేశీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
కాగా.. హరియాణ (మానేసర్), గురుగ్రామ్ ప్రాంతాల్లోని కార్ల తయారీని నిలిపివేయాలని, ఆఫీస్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. వెంటనే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. అలాగే కంపెనీకి చెందిన రోహ్తక్లో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మూసేస్తామని తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా మూసివేత కొనసాగుతుందని కంపెనీ వివరణ ఇచ్చింది.
మరోవైపు.. మహీంద్రా కంపెనీ కూడా వాహన తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా వెంటిలేటర్ల తయారీ సాధ్యాసాధ్యాలను చర్చిస్తున్నామని మహీంద్రా గ్రూప్ బాస్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా మహీంద్రా హాలిడేస్ సంస్థ తన రిసార్ట్స్ను మెడికల్ కేర్ సెంటర్లుగా ఉపయోగించుకునేందుకు అందుబాటులో ఉంచనుందని పేర్కొన్నారు.
అయితే.. ఇప్పటికే అంతర్జాతీయంగా కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 10 వేలు దాటిపోయింది. ఇంకా ఈ వైరస్ 2 లక్షల మందికి పైగా సోకింది. మన దేశంలో కూడా 300కు పైగా మందికి కరోనా ఉంది. ప్రస్తుతం భారత్ స్టేజ్ 3లో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అందుకే ఆయా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటిస్తూ వస్తున్నాయి.