గుట్టుచప్పుడు కాకుండా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు..!
మెయిల్ హ్యాకింగ్ ద్వారా నైజీరియన్లు మోసాలు. లక్షల రూపాయల నగదును తమ ఖాతాలకు మళ్లించారు.
కరోనా పుణ్యామాని ఆన్ లైన్ లావాదేవీలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. లాక్డౌన్ కారణంగా ఇంటర్నేట్ బిజినెస్ చేస్తున్న వ్యాపారుల అధికారిక మెయిల్స్ను హ్యాక్చేసి సొమ్ము కాజేస్తున్నారు. ఇంటర్నేట్ అక్రమాలకు పాల్పడుతున్న నైజీరియన్లు తమ రూటు మారుస్తున్నారు. లాక్డౌన్ అంక్షలతో ప్రైవేటు సంస్థలు వ్యాపార లావాదేవీలను ఈ-మెయిల్స్ ద్వారానే చేస్తున్నారని గ్రహించారు. వారి అధికారిక మెయిల్స్ను హ్యాక్చేసి నకిలీ మెయిల్స్ పంపించి వారి ఖతాల్లోంచి లక్షల్లో నగదును దోచేస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్లో ఒక కంపెనీ ఈ-మెయిల్ను హ్యాక్చేసి రూ.25 లక్షలు బదిలీ చేయించుకున్నారు. వారం రోజుల్లో ఇలా రూ.85 లక్షలు వారి ఖాతాల్లో వేయించుకున్నారు. డార్క్నెట్ వైబ్సైట్లో కంపెనీల మెయిల్స్, పాస్వర్డ్లు దొంగిలించి మెయిల్ హ్యాకింగ్ ద్వారా నైజీరియన్లు మోసాలు చేస్తున్నారని సైబర్ క్రైమ్ ఏసీపీ తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్లో ఉంటున్న ఐరన్ వ్యాపారి ఓవర్డ్రాఫ్ట్ ఖాతాల్లోంచి నైజీరియన్లు రూ.36లక్షలు కొల్లగొట్టారు. ఇతని ఈ-మెయిల్ను హ్యాక్ చేశారు. బ్యాంక్ ఖాతా పాస్వర్డ్నూ చేజిక్కించుకుని సంతోష్శర్మ, జితేందర్, సందీప్ పేర్లను ఐరన్ వ్యాపారి ఓవర్డ్రాఫ్ట్ ఖాతాలకు లబ్ధిదారులుగా చేర్చారు. మూడు రోజుల నుంచి 3 ఖాతాల ద్వారా తమ బ్యాంక్లకు నగదు బదిలీ చేసుకున్నారు. వ్యాపారి మెయిల్ను పరిశీలించగా.. దిల్లీలోని నైజీరియన్లు వినియోగించినట్టు ఐపీ చిరునామాలు కనిపించాయి. దీంతో పోలీసులను ఆశ్రయించాడు వ్యాపారి. మరోవైపు దిల్లీలో ఉంటున్న నైజీరియన్లకు హైదరాబాద్లోని కార్పొరేట్ కంపెనీల ఈ-మెయిళ్లను హ్యాక్చేయడమే పని. సంస్థల యజమానులు, ప్రతినిధులు సమాచారం పంపినట్టుగా వారి వినియోగదారులకు.. సాంకేతిక కారణాల వల్ల బ్యాంకు ఖాతాను మార్చాం..ఈరోజు నగదును ఫలానా ఖాతాకు జమ చేయండి.. అంటూ అధికారిక మెయిల్ పంపుతున్నారు. ఆయా కార్పొరేట్ కంపెనీలు నిజమేనని నమ్మి నైజీరియన్లు సూచించిన ఖాతాలకు నగదు బదిలీ చేయగానే.. వెంటనే వారు ఏటీఎంల ద్వారా డ్రా చేసేసుకుంటున్నారు. ఇలా దేశవ్యాప్తంగా గుట్టచప్పుడు కాకుండా డార్కనెట్ లో సొమ్ములు కాజేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చిన బ్యాంక్ లకు గానీ , పోలీసులకు గానీ ప్రతి కస్టమర్ సమాచారం ఇవ్వాలని తెలిపారు.