ఇవాళ రాష్ట్ర మంత్రిమండలి భేటీ.. పలు కీలక బిల్లులకు ఆమోదం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఉన్నాతాధికారు హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఉన్నాతాధికారు హాజరుకానున్నారు. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టం ముసాయిదా సహా శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులు, శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఇప్పటికే రెవెన్యూ చట్టం ముసాయిదాపై కసరత్తు పూర్తయింది. అలాగే, ఆహారశుద్ధి విధానం, లాజిస్టిక్స్ విధానం ముసాయిదాలు సిద్ధమైనట్లు సమాచారం. వీటన్నింటికీ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయనుంది.
అలాగే, రాబోయే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అటు, మండలిలో గవర్నర్ కోటాలో భర్తీచేయాల్సిన మూడు ఎమ్మెల్సీ స్థానాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్లకు ఎమ్మెల్సీలుగా మరోమారు అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతుంది. లేదా కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కూడా మంత్రి మండలి చర్చించే అవకాశం ఉంది. ఇక, మూడో స్థానానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకాధికారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారామ్నాయక్ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఇక, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణ భవన్లో జరుగనుంది. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రస్తావనపై శాసనసభ్యులకు సీఎం కేసీఆర్ మార్గదర్శకం చేయనున్నారు.