ఎమ్మెల్యే రామలింగారెడ్డికి తెలంగాణ అసెంబ్లీ ఘన నివాళి
దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. రామలింగారెడ్డి మృతిపట్ల తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. రామలింగారెడ్డి మృతిపట్ల తెలంగాణ శాసనసభలో సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామలింగారెడ్డి నిరాడంబర నాయకుడు అని, ఆయన ఎమ్మెల్యే కాక ముందే తనకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తదని తన ఊహకు కూడా లేకుండే. బాధాతప్త హృదయంతో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నా.. రామలింగారెడ్డి మృతిపట్ల ఈ సభ సంతాపం తెలుపుతోంది. ఉద్యమ నేపథ్యంలో ఎదిగి వచ్చిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి.. నిత్యం ప్రజల మధ్యనే మనుగడ సాగించిన నిరాడంబరగా నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణం దుబ్బాక నియోజకవర్గం ప్రజలకు తీరని లోటన్న సీఎం కేసీఆర్.. ఆయన మరణం తెలంగాణ ప్రజల హృదయాలను కలిచివేసింది.
సామాన్య రైతు కుటుంబంలో జన్మింనిచిన సోలిపేట రామలింగారెడ్డి.. విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. మెదక్ జిల్లాలో జరిగిన ఉద్యమాలకు బాసటగా నిలిచారు. జర్నలిస్టుగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారాల కోసం అనేక రాజీలేని పోరాటాలు నిర్వహించారు. తాను నమ్మిన ఆదర్శాలను ఆచరణలో పెట్టిన అభ్యుదయవాది. వరకట్నం లేకుండా ఆదర్శ వివాహం చేసుకున్నారని గుర్తు చేసిన సీఎం కాళోజీ, తన చేతుల మీదుగా ఆ పెళ్లి జరిపించారన్నారు.
దొమ్మాట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచి యువ నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని సీఎం కొనియాడారు. ఉద్యమ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. 2014, 18 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం పని చేసేవారు. మధుమేహ వ్యాధితో బాదపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని మంత్రి కేటీఆర్ అన్నారు. రామలింగారెడ్డి సంతాప తీర్మానంపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కలం వీరుడిగా ఉద్యమానికి మద్దతునిచ్చిన వ్యక్తి రామలింగారెడ్డి అని పేర్కొన్నారు. గొప్ప వ్యక్తిత్వమని, నిరాడంబరమైన జీవన విధానంతో ఉండేవారని కేటీఆర్ అన్నారు. ఉద్యమ సహచరుడిగా రామలింగారెడ్డి సేవలు మరువలేనివన్నారు కేటీఆర్.
తెలంగాణ ఉద్యమంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. రామలింగారెడ్డి లేరనే విషయం కంటతడి పెట్టించిందని పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉండే నాయకుడు అకాల మరణం తీరని బాధ కలిగించిందన్నారు. విద్యార్థి దశ నుంచే రామలింగారెడ్డి ఉద్యమాల్లో పాల్గొన్నారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమ నేతగా తెలంగాణ ప్రజల మధ్య చిరస్థాయిగా నిలుస్తారన్నారు. ఆయనపై అనేక కేసులు పెట్టారు. టాడా కేసులో మూడు నెలల పాటు రామలింగారెడ్డి జైలు శిక్ష అనుభవించారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఆయన ముందుండే వారు అని మంత్రి గుర్తు చేశారు.