AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముస్లింగా పుట్టి తత్వవేత్తగా మారిన శ్రీ ఎం.. భారత ప్రభుత్వం చేత మన్ననలను పొందుతున్న యోగా గురువు.. ఇంతకీ ఎవరతను..?

Born a Muslim & Leading Life of Yogi: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిన్న చిత్తూరు జిల్లా పర్యటించారు. సత్సంగ్‌ ఆశ్రమ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ముంతాజ్‌ అలీ ఆహ్వానం మేరకు..

ముస్లింగా పుట్టి తత్వవేత్తగా మారిన శ్రీ ఎం.. భారత ప్రభుత్వం చేత మన్ననలను పొందుతున్న యోగా  గురువు.. ఇంతకీ ఎవరతను..?
Subhash Goud
|

Updated on: Feb 08, 2021 | 10:23 AM

Share

Born a Muslim, Leading Life of Yogi: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిన్న చిత్తూరు జిల్లా పర్యటించారు. సత్సంగ్‌ ఆశ్రమ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ముంతాజ్‌ అలీ ఆహ్వానం మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ మదనపల్లెకు వచ్చారు. అక్కడి ఆశ్రమాన్ని సందర్శించి గిరిజన విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులంతా ఉన్నతంగా ఎదగాలని ఆకాక్షించారు.

అయితే 38 పడకల స్వస్త్‌ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్రపతి శుంకుస్థాపన చేశారు. ఆశ్రమ ఆవరణలో మొక్కలు నాటి, భారత్‌ యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి సదుం మండలంలోని పిపుల్స్‌ గ్రో పాఠశాల సదర్శనకు బయలుదేరారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌ ద్వారా మదనపల్లెకు చేరుకున్న రాష్ట్రపతికి.. హెలిపాడ్‌ వద్ద సీఎం జగన్‌, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అయితే విద్యతోపాటు వ్యాయమం ఎంతో అవసరమనే ఉద్దేశంతో యోగా కార్యక్రమాలు, ఆశ్రయాలను నెలకొల్పాడు ముంతాజ్‌ అలీ. యోగా, ధ్యానం ద్వారా ఆలోచన శక్తి మరింత మెరుగు పర్చుకోవచ్చనే కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అయితే అట్టడుగు వర్గాల అభివృద్ధికి నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నందుకు ఆశ్రమ నిర్వాహకులను రాష్ట్రపతి అభినందించారు. పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ కోర్టును ప్రారంభించారు. కాగా, సత్సంగ్‌ ఫౌండేషన్‌ను సందర్శించినందుకు గుర్తుగా ఆశ్రమ ఆవరణలో రావి మొక్క నాటారు. సుమారు 4 గంటలపాటు రాష్ట్రపతి పర్యటన సాగింది.

ఎవరీ ముంతాజ్‌ అలీ..

సత్సంగ్‌ ఆశ్రమ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ముంతాజ్‌ అలీ ముస్లిం కుటుంబంలో జన్మించినా.. హిందూ ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తున్నారు. ముంతాజ్‌ అలీ 1948 నవంబర్‌ 6న కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో జన్మించారు. ఈయన ఓ ఆధ్యాత్మిక వేత్త. జిడ్డు కృష్ణమూర్తిలా ఓ వేదాంతి. కృష్ణమూర్తికి చెందిన రిషి వ్యాలీతో అభినాభావ సంబంధమున్న ముంతాజ్‌ అలీ.. సత్సంగ్‌ ఫౌండేషన్‌ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్నారు. జిడ్డు కృష్ణమూరి తత్వాన్ని, భారతీయ తాత్వికతను ఒంటబట్టించుకున్న ముంతాజ్ అలీ.. మిస్టర్ ఎం గానూ పేరు తెచ్చుకున్నారు. పరమత సహనం, శాంతి కొరకు యావత్ భారతదేశం పర్యటించి, శాంతి, తత్వముల సారాన్ని ప్రజలకు వివరిస్తూ అనేక యాత్రలను కార్యక్రమాలను చేపట్టాడు. ముంతాజ్‌ అలీ సత్సంగ్‌ ఫౌండేషన్‌ను స్థాపించి చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక పాఠశాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను నడుపుతున్నాడు. ఆయన మంచి రచయిత, యోగా గురువు. అలాగే ముంతాజ్‌ అలీ ముస్లిం కుటుంబంలో పుట్టినా.. హిందూ ఆధ్యాత్మికత వైపు వెళ్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఆశ్రమ నిర్మాణాలు, ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. అలాగే పీపల్‌ గ్రో పాఠశాలను నెలకొల్పాడు. ముంతాజ్‌ అలీ చేసిన సేవలకు గాను 2020 సంవత్సరంలో పద్మాభూషణ్‌ అవార్డును అందుకున్నారు.

19 ఏళ్లకే హిమాలయాల బాట..

కాగా, ముంతాజ్‌ అలీ ధ్యానంపై ఆసక్తితో 19 ఏళ్లకే హిమాలయాల బాటపట్టాడు. యోగిగా మారి 20 ఏళ్ల కిందట చిత్తూరు జిల్లా మదనపల్లె వచ్చి సత్సంగ్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు. పేదలకు ఉచిత విద్యనందిస్తూనే లోకాసమస్త సుఖినోభవంతు అంటూ శాంతికాముడిగా మారెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ముంతాజ్‌అలీ దేశ విదేశాల్లో శాంతిప్రవచనాలు బోధిస్తూ ఆధ్యాత్మికత వ్యాప్తికి కృషిచేస్తున్నారు. ముంతాజ్‌ అలీ చిన్ననాటి నుంచి అధ్యాత్మిక ఆలోచనలు పెంచుకున్నారు. 19 ఏళ్ల వయసులో ధ్యానంపై ధ్యాసతో హిమాలయాల్లోని బద్రీనాథ్‌ గుహలకు చేరుకున్నారు. అక్కడ మహేశ్వర్‌నాథ్‌ బాబా శిష్యరికంతో జ్ఞానోదయం పొందారు. తర్వాత త్రివేండ్రలోని మోడల్‌స్కూల్‌ ఉపాధ్యాయుల బోధన తీరు, వ్యవహార శైలితో ముంతాజ్‌అలీ స్పూర్తిని పొందారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా తిరుగుతూ చంద్రశేఖర్‌ సరస్వతి, రమణ మహర్షి తదితరుల సాన్నిహిత్యంతో మరింత మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణ మూర్తి పరిచయంతో జిల్లాలోని కురుబలకోట మండలంలోని రిషివ్యాలీ విద్యాసంస్థ ట్రస్ట్‌ సభ్యుడిగా అవకాశం దక్కింది. అక్కడ అంగ్ల ఉపాధ్యాయురాలు, బ్రహ్మణ యువతి అయిన సునందతో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు వెళ్లింది. అనంతరం కర్ణాటకలోని రాయల్పాడు సమీపంలో ఉన్న రిషివ్యాలీ అనుబంధ నీల్‌బాగ్‌ విద్యాసంస్థలో ఆయన పదేళ్లు పని చేశారు. అక్కడే భార్య సునంద, కుమారుడు రోషన్‌, కుమార్తె ఆయీషాతో గడిపారు.

పేదలకు ఉచిత విద్య..

కాగా, నీల్ బాగ్‌లో పని చేస్తున్న ముంతాజ్‌ అలీ పలు కారణాలతో రిషివ్యాలీ ట్రస్టు సభ్యుడిగా రాజీనామా చేసి నేరుగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లె చేరుకున్నారు. బెంగళూరు మార్గంలోని పొన్నేంటిపాళెం క్రాస్‌ వద్ద నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 20 ఏళ్ల కిందటనే సత్సంగ్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అందులో సత్సంగ్‌ విద్యాలయంను ఏర్పాటు చేసి ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. ఇక్కడ చదివే 250 మంది పేద గిరిజన విద్యార్థులకు రెండు పూటలా ఉచిత భోజనం అందిస్తున్నారు. ఉపన్యాసాల్లో ఆరితేరిన ముంతాజ్‌ అలీ.. శాంతి తన నినాదమని చెబుతుంటారు.

అన్ని మతాల శాంతిమార్గంలో నడిస్తే ప్రపంచం ఓ అద్భుతంగా మారుతుందని చెబుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా ముంతాజ్‌ అలీ అమెరికా, యూకే, మాస్కో, దుబాయ్‌, స్విట్జర్లాండ్‌, ప్యారిస్‌, ఫిన్లాండ్‌ తదితర దేశాల్లో సత్సంగ్‌ ఫౌండేషన్‌ శాఖలను ఏర్పాటు చేశారు. స్వయంగా ఆయా దేశాల్లో తరచూ పర్యటిస్తూ శాంతిమార్గంలో నడవాలంటూ ఆధ్మాతిక బోధనలు చేస్తుంటారు. సత్సంగ్‌ ఫౌండేషన్‌ అందిస్తున్న సేవలు, ఆధ్యాత్మికత వ్యాప్తికి ముంతాజ్‌ అలీకి చేస్తున్న సేవలకు ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందారు. ఆయన సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 2020 సంవత్సరానికిగాను పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించింది.

పద్మభూషణ్‌ రావడం ఎంతో సంతోషంగా ఉంది: ముంతాజ్‌ అలీ

కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని ముంతాజ్‌ అలీ అంటున్నారు. చిన్నారులు శాంతి కాములు, వారిని చిన్ననాటి నుంచే శాంతి మార్గంలో నడిపిస్తే ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుంది. కేరళ రాష్ట్రంలో ఎర్రజెండాలకు ప్రసిద్ధి. అక్కడ ప్రతి విద్యార్థి కమ్యూనిజాన్ని అనుసరిస్తుంటారు. ఎప్పుడు వెళ్లినా కేరళీయులు సొంత బిడ్డలా చూసుకుంటారు. అయితే మదనపల్లె ప్రాంత ప్రజలు అందించిన సహకారంతో నేడు ఈస్థాయికి చేరాను. ఇక్కడి ప్రజలందరూ శాంతి కాములే. అందరూ శాంతికోరుతూ కలిసిమెలసి జీవిస్తే ప్రపంచాన్ని అద్భుతంగా సృష్టించవచ్చు. రుగ్వేదంలో చెప్పినట్లు లోకాసమస్త సుఖినోభవంతు.. అన్నదే నా మార్గం అని ముంతాజ్‌ అలీ పేర్కొంటున్నారు.

Also Read: ప్రధాన మంత్రి జన‏ధన్ ఖాతాదారులకు గమనిక.. ఆ లింక్ చేయకపోతే.. రూ.2.30 లక్షలు మిస్సయినట్టే..

Follow Us