బీరూట్ లో పేలుడు బాంబు దాడి కావచ్చు, ట్రంప్
లెబనాన్ రాజధాని బీరూట్ లో పేలుళ్లు జరిగి 100 మందికి పైగా మరణించగా దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. ఇళ్ళు కోల్పోయి సుమారు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనపై స్పందించిన..
లెబనాన్ రాజధాని బీరూట్ లో పేలుళ్లు జరిగి 100 మందికి పైగా మరణించగా దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. ఇళ్ళు కోల్పోయి సుమారు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇది బహుశా బాంబు దాడి కావచ్చునన్నారు. తమ సైనికాధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారు. ఈ దారుణంలో మృతి చెందినవారి కుటుంబాలకు, గాయపడినవారికి సంతాపం తెలుపుతున్నామని, లెబనాన్ కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. ఆ దేశ ప్రజలను ఆదుకుంటామన్నారు. ఆ దేశంతో తమ దేశానికి మంచి సంబంధాలు ఉన్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.
పేలుడు కారణంగా విష వాయువులు వెలువడవచ్చునని, అందువల్ల తమ దేశ ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని బీరూట్ లోని అమెరికన్ ఎంబసీ కోరింది. కాగా-ఫర్టిలైజర్ బాంబుల తయారీలో వినియోగించే వేల టన్నుల అమోనియం నైట్రేట్ కి అత్యధిక పేలుడు శక్తి ఉందని నిపుణులు చెబుతున్నారు. దగ్గరలో ఉన్న వెల్డింగ్ షాపు నుంచి రేగిన మంటల కారణంగా అమోనియం నైట్రేట్ పేలిపోయి ఉండవచ్చు అని వీరు అంటున్నారు. పేలుడు దృశ్యాలు, ప్రజలు తమ బిడ్డలతో ఇళ్లలో భయంతో పరుగులు తీస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Video Courtesy: Mail Online