బతుకమ్మ… బతుకు తల్లీ.. ఎదుగు తల్లీ..!!

ఎక్కడ మహిళలు పూజింపబడతారో.. గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని చెబుతుంటారు. ఇందులోని అంతరార్థం ఏదైనా మహిళల పట్ల మానవీయత, గౌరవ మర్యాదలతో వ్యవహరించగలిగినపుడే సమాజం అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది. వివక్షకు ఆధిపత్యానికీ ఎలాంటి తావుండదు. విలువలు ఇనుమడిస్తాయి. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయం కొంతమేర బతుకమ్మ పండుగలో వ్యక్తమవుతుంది. ఈ సంబరం తెలంగాణకే ప్రత్యేకమైనా గత చరిత్ర, జీవితగాథలు, సున్నితమైన మానవ సంబంధాలను తెలియజేస్తుంది. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…’ అంటూ కష్టసుఖాలనూ, ప్రేమా ఆప్యాయతల్నీ బతుకమ్మ పాటలుగా […]

బతుకమ్మ... బతుకు తల్లీ.. ఎదుగు తల్లీ..!!
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 4:48 PM

ఎక్కడ మహిళలు పూజింపబడతారో.. గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని చెబుతుంటారు. ఇందులోని అంతరార్థం ఏదైనా మహిళల పట్ల మానవీయత, గౌరవ మర్యాదలతో వ్యవహరించగలిగినపుడే సమాజం అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుంది. వివక్షకు ఆధిపత్యానికీ ఎలాంటి తావుండదు. విలువలు ఇనుమడిస్తాయి. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయం కొంతమేర బతుకమ్మ పండుగలో వ్యక్తమవుతుంది. ఈ సంబరం తెలంగాణకే ప్రత్యేకమైనా గత చరిత్ర, జీవితగాథలు, సున్నితమైన మానవ సంబంధాలను తెలియజేస్తుంది. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…’ అంటూ కష్టసుఖాలనూ, ప్రేమా ఆప్యాయతల్నీ బతుకమ్మ పాటలుగా మేళవించడం అందులో భాగమే. అందుకే బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రకృతి ఆరాధ్య పండుగ.శరదృతువులో వచ్చే బతుకమ్మ సంబరాలకు శతాబ్దాల చరిత్ర ఉందని చెబుతుంటారు. కాకతీయుల కాలం నుంచే బతుకమ్మను నిర్వహిస్తున్నట్టు కొందరంటే.. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోయిన మహిళలను గుర్తుచేసుకుంటూ పండుగ నిర్వహిస్తున్నట్టు మరికొందరు చెబుతుంటారు. పెత్తందార్ల అకృత్యాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రతీకగా పూలను పేర్చి ‘బతుకమ్మా.. బతుకు అమ్మా..’ అంటూ పదంపదం పేర్చి పాటపాడారు. బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో.. ఊరూరా ఆలపించే గానం వెనుక ఆంతర్యం ఇదే..!

నాటికీ నేటికీ కాలం మారినా.. పరిజ్ఞానం పెరిగినా ఈ ఆధునిక సమాజంలో పరిస్థితులు మరింత దిగజారాయి. పసిబిడ్డా, వృద్ధులా అనే తేడా లేకుండా వారిపై దుర్మార్గాలు జరుగుతూనే ఉన్నాయి. తల్లి గర్భంలో నవమాసాలు వెచ్చగా ఉండాల్సిన బిడ్డను నెలల్లోనే చిదిమేస్తున్నారు. ఆడబిడ్డో, మగబిడ్డో ముందే తెలుసుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆడబిడ్డ పుట్టిన క్షణాల్లోనే తల్లి పొత్తిళ్ల నుంచి దూరంచేసి చెట్ల పొదల్లోనో, చెరువు గట్టుపైనో పడేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ పర్యవసానమే నేడు స్త్రీ పురుష నిష్పత్తి తేడాలకు కారణమైంది. తెలంగాణలో వెయ్యి మంది పురుషులకు 881 మంది బాలికలున్నట్టు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావానికి ఏడాది ముందు 954గా ఉన్న బాలికల సంఖ్య అనంతర కాలంలో పడిపోవడం ఆడపిల్లల పట్ల వివక్ష తీవ్రతను తెలియజేస్తున్నది. ఇది సమాజానికి ఓ హెచ్చరిక. తెలంగాణలోనే కాదు.. దక్షిణాదిలో కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో బాలబాలికల నిష్పత్తిలో తీవ్ర అంతరం కనిపిస్తున్నట్టు ఒక సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతియేటా దిగజారిపోవడం మరింత ఆందోళనకు దారితీస్తున్నది. అయినా ఇవేవీ పాలకులకు పట్టకపోవడమే అసలు సమస్య.మహిళా సాధికారతకు పాటుపడుతున్నామని చెబుతున్న పాలకులు మహిళలపై దాడులను, హత్యలనూ అరికట్టలేకపోతున్నారనే విషయం వాస్తవం. ప్రకటనలు, ప్రచారార్భాటాలు తప్ప అఘాయిత్యాలపై ఏలికలు ఏనాడూ నోరుమెదపడం లేదు.

మహిళల భద్రత దిశగా చర్యలు చేపట్టకుండా కంటితుడుపు చర్యగా పథకాలు, రుణాలు విదిల్చి ‘సాధికారత’ అనే విస్తృతమైన పదాన్ని పరిమితం చేసేస్తున్నారు. సాధికారత అనే లోతైన భావాన్ని కప్పిపెట్టేస్తున్నారు. అయినప్పటికీ రాజకీయ, ఉద్యోగ రంగాల్లో మహిళలకు తగినన్ని అవకాశాలున్నాయా? విధానపరమైన నిర్ణయాల్లో వారి పాత్ర ఏమిటి? అన్నది ప్రశ్నార్థకమే. మహిళలు ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు అన్నిరంగాల్లో ముందుకెళ్తూ సర్వతోముఖాభివృద్ధి సాధించినప్పుడే నిజమైన సాధికారత. అందుకే వ్యవస్థలో నేడు కొనసాగుతున్న పితృస్వామ్య సమాజ పోకడల్ని రూపుమాపాలి. పుట్టిన ప్రతి బిడ్డకూ లింగబేధం లేకుండా పౌష్టికాహారం, విద్యా, వైద్యం అందించి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. బతుకమ్మ పండుగ సందర్భంగా ‘బతుకనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం..’ అనే నినాదం వినిపించినా పాలకులు దాని అమలు దిశగా అడుగేస్తేనే నిజమైన మహిళా సాధికారతకు పునాది పడుతుంది. బేటీ బచావో.. బేటీ పడావో.. అన్న ప్రధాని పిలుపును కింది స్థాయిలో అమలు పరచగలిగితే ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఫలితంగా తీరొక్కపూవు బతుకమ్మలో ఒదిగిపోయినట్టు విభిన్న జీవితాలు సమాజంలో ప్రతిబింబిస్తాయి. ‘బతుకు అమ్మా…!’ పిలుపులోని మాధుర్యం.. తాత్పర్యం సాకారమవుతుంది. ఆ దిశగా అందరం అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.