Coronavirus Alert : సూర్యాపేటలో కరోనా కన్నెర్ర..ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్
మహమ్మారి కరోనా వైరస్కు వ్యాక్సిన్ వస్తుందన్న కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇప్పటికే కోవిడ్-19 చేయాల్సిన డ్యామేజ్ చేసింది. ఏమాత్రం అలసత్వం చేసినా చాప కింద నీరులా విస్తరిస్తుంది.

మహమ్మారి కరోనా వైరస్కు వ్యాక్సిన్ వస్తుందన్న కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇప్పటికే కోవిడ్-19 చేయాల్సిన డ్యామేజ్ చేసింది. ఏమాత్రం అలసత్వం చేసినా చాప కింద నీరులా విస్తరిస్తుంది. తాజాగా సూర్యాపేటలో కరోనా కలకలం రేపింది. ఒక కుటుంబంలో ఏకంగా 22 మందికి వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో కాలనీ మొత్తం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు అధికారులు. యుద్ధ ప్రాతిపదికన శానిటేషన్ పనులు చేస్తున్నారు. కరోనా సోకినవారు ఇటీవల అంత్యక్రియల్లో పాల్గొనట్లు అధికారులు గుర్తించారు. అక్కడికి వెళ్లిన వారందర్నీ హోమ్ క్వారంటైన్కు వెళ్లాలని సూచిస్తున్నారు.
ఇక తెలంగాణలో కొత్తగా 461 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 617 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,86,815కు చేరింది. వీరిలో 2,79,456 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,815 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా కారణంగా 1544 మంది ప్రాణాలు విడిచారు.