Fuel Crisis: ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్ కష్టాలు తీరేదెప్పుడంటే?
పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను ఇంధన సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లకు కారణమవుతున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరుతో అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించిపోయింది. ఇంతకూ ఈ సమస్య ఎప్పుడు సద్దుమణుగుతుంది.

ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఈ సముద్ర మార్గంలో సాధారణంగా రోజుకు 130 నౌకలు ప్రయాణిస్తాయి. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య కేవలం 10కి పడిపోయింది. పర్షియన్ గల్ఫ్లో సుమారు 850 నౌకలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాటిలో 14 భారతీయ నౌకలు ఉన్నాయి. ఈ నౌకల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఇరాన్ చిన్న పడవల ద్వారా సముద్రంలో మైన్స్ అమర్చిందన్న అమెరికా అనుమానాలు నౌకాయాన సంస్థలను మరింత భయపెడుతున్నాయి.
అయితే మన భారత్కు మాత్రం ఇక్కడో గుడ్న్యూస్ ఉంది. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారత నౌకలు సురక్షితంగా స్వదేశానికి చేరుతుండటం జనాలకు ఊరటనిచ్చే విషమనే చెప్పాలి. తాజాగా దేశ్ గరిమా అనే భారతీయ నౌక హార్ముజ్ మార్గాన్ని చాకచక్యంగా దాటి ముంబై తీరానికి చేరింది. ఈ నౌక ఖతార్ నుంచి 97 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్తో బయలుదేరింది. ఇరాన్ తీర ప్రాంతాన్ని ఆనుకుని ప్రయాణిస్తూ, పాకిస్థాన్ తీరం మీదుగా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించడం ద్వారా అమెరికా నేవీ పర్యవేక్షణను తప్పించుకోగలిగింది.
హార్ముజ్ దిగ్బంధం ప్రభావం నేరుగా తెలుగు రాష్ట్రాలపై పడింది. డీలర్లకు ట్యాంకర్లు సకాలంలో చేరకపోవడం, దానికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో ప్రజలు ఒక్కసారిగా బంకుల వద్దకు చేరుకోవడంతో పానిక్ సిట్చువేషన్ ఏర్పడింది. దీంతో జనాలు పెట్రోల్ కోసం బంకుల్లో క్యూ కడుతున్నారు. అయితే రాష్ట్రంలో దేశంలో ఇందన నిల్వలకు కొరతలేదని.. కేవలం రవాణాలో తలెత్తిన జాప్యం వల్లే ఈ సమస్య వచ్చిందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బుధవారం కల్లా పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇందన కష్టాలు తొలిగిపోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ అవ్వడం. అది ఓపెన్ అవ్వాలంటే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరాలి. ఇరుదేశాలు తమ పంతాలను వీడి చర్చలకు రావాలి. అప్పుడే హార్ముజ్ వద్ద నౌకల క్యూ తగ్గి, సరఫరా పునరుద్ధరించబడుతుంది. ఈ అంతర్జాతీయ సంక్షోభం త్వరగా ముగియాలని, అప్పుడే సామాన్యుడిపై పడుతున్న ఇంధన భారం, ఆందోళన తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
