AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Stroke Day: ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్టే…

అధిక రక్తపోటు, మితిమీరిన ఒత్తిడి, మద్యపానం, ధూమపానం, స్థూలకాయం వంటి కారణాలతో చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. కరోనా బాధితుల్లో అధిక శాతం బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారని ఇటీవల ఓ రీసెర్చ్‌లో వెల్లడైంది.

World Stroke Day:  ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఉన్నట్టే...
దీని వల్ల శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. స్ట్రోక్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఎంత త్వరగా చికిత్స అందిస్తే, అంత మెరుగ్గా ఆరోగ్యం ఉంటుంది. సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల నరాల వ్యాధులు సంభవిస్తున్నాయి. వాటిల్లో మైగ్రేన్లు, స్ట్రోక్స్, మూర్ఛలు, అనేక రకాల క్యాన్సర్లు, మెదడు కణితులు వంటివి వస్తున్నాయి. నేటి కాలంలో ఇవి చాలా సాధారణమైపోయాయి. ప్రతి సంవత్సరం 40 నుండి 50 వేల మంది బ్రెయిన్ ట్యూమర్‌తో మరణిస్తున్నారు.
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 29, 2024 | 4:20 PM

ఉన్నట్టుండి తూలిపడిపోతున్నారా.. రెప్పపాటులోనే కంటి చూపు పోయి అంతా చీకటి అవుతోందా…పెదవులు ఓ పక్కికి లాగినట్టు అవుతున్నాయా? అయితే తస్మాత్ జాగ్రత్త? అది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం కావచ్చు. గుండెపోటు వస్తే కాస్త ఆలస్యం అయితే ప్రాణం పోతుంది కానీ… బ్రెయిన్ స్ట్రోక్ వస్తె అలా కూడా కాదు. మనిషిని బతికినంత కాలం అంగవైకల్యం భారిన పడేసి… మరొకరి మీద ఆధారపడే దీన స్థితికి తీసుకువస్తుంది. అందుకే స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్ఫందించాలంటున్నారు వైద్యులు. ప్రపంచ స్ట్రోక్ డేని పురస్కరించుకుని అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుంది. స్ట్రోక్ వచ్చిన విషయాన్ని ఎలా గుర్తించాలి? బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను ఇప్పుడు చూద్దాం.

స్ట్రోక్… ఈ పదం చెప్తే చాలా మందికి గుండెపోటు గుర్తుకు వస్తుంది. అయితే వాస్తవానికి గుండెపోటుతో సమానంగా బ్రెయిన్ స్ట్రోక్ కూడా ప్రమాదకరమైందే అని చెప్తున్నారు వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కొన్నిసార్లు ప్రాణం పోతుంది. ఇంకొన్నిసార్లు పక్షవాతం బారినపడతారు. తలలోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి రక్తం సరఫరా నిలిచిపోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఒక్కసారి స్ట్రోక్ బారిన పడితే నాలుగు గంటలలోపు సరైన చికిత్స అందించకపోతే మనిషి చనిపోవచ్చు లేదా జీవితకాలం వైకల్యం బారిన పడి మంచానికే పరిమితమవుతుంటారు. అందుకే బ్రెయిన్ స్ట్రోక్‌ని అత్యంత ప్రమాదకారిగా చెబుతుంటారు. శరీరంలోని ఓ చేయి బలహీనంగా అనిపించటం, అడుగువేసేందుకు కాళ్లు సహకరించకపోవటం, ఉన్నపళంగా బ్యాలెన్స్ తప్పి పడిపోతుండటం, కళ్లకు ఏమి కనిపించకుండా చీకట్లు కమ్మటం, మూతి ఓ పక్కకు తిరిగిపోతుండటం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. భారత్ లో ప్రతి నలభై సెకన్లకు ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ భారిన పడుతుండగా… నాలుగు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. మరణాలకు దారి తీస్తున్న సమస్యల్లో స్ట్రోక్‌ది నాలుగో స్థానం అయినా దీనిపై అవగాహన మాత్రం అంతంత మాత్రమే. గుండె జబ్బులపై ఉన్న అవగాహనలో సగం కూడా బ్రెయిన్ స్ట్రోక్స్‌పై లేకపోవటం బాధాకరమంటున్నారు నిపుణులు.

బ్రెయిన్ స్ట్రోక్స్ లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్. ఇందులో మెదడులోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల వచ్చే స్ట్రోక్. దాదాపు 87 శాతం బ్రెయిన్ స్ట్రోక్‌లు ఇలా రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల వచ్చేవే. రెండోది హిమోరేజిక్ స్ట్రోక్. మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఈ తరహా స్ట్రోక్‌లు వస్తాయి. కేవలం 13 శాతం మాత్రమే ఈ తరహా స్ట్రోక్‌లు ఉంటాయి. మనిషి శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా మెదడు నుంచే సంకేతాలు రావాలి. అలాంటి మెదడు రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మనిషి మరణానికి దారి తీయటం లేదా పక్షవాతంతో కాళ్లు, చేతులు పనిచేయక శాశ్వత వైకల్యానికి దారి తీస్తోంది. దీంతో ఒక్కసారి స్ట్రోక్ బారినపడితే చాలు మనిషి జీవితం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణాలు అనేకం. మెదడులో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రధాన కారణాలు కాగా.. కొన్ని రకాల గుండె జబ్బులు, వారసత్వం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, గురక, స్లీప్ ఆప్నియా వంటి అనేక కారణాలు స్ట్రోక్‌కి దారితీస్తున్నాయి. ఇటీవలే వాతావరణ మార్పులు సైతం స్ట్రోక్‌కి కారణమవుతున్నట్టు నిపుణులు గుర్తించారు. అయితే స్ట్రోక్‌కి సరైన సమయానికి గుర్తిస్తే బాధితులను కాపాడుకునే అవకాశం ఉంది. స్ట్రోక్ భారిన పడిన వారిని ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులకు తీసుకువెళ్లి.. టెస్టులు చేసి నాలుగు గంటలలోపే కొన్ని రకాల ఇంజక్షన్లు ఇవ్వటం ద్వారా బాధితులు శాశ్వత వైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చు.

సరైన జీవన విధానం, బీపీ, షుగర్‌లను నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు వైద్యులు. అయితే స్ట్రోక్ వచ్చిన వారిని తక్షణం ఆస్పత్రులకు తరలించటంలో జాప్యం వద్దని… నిమిషం పాటు జరిగే ఆలస్యం కూడా మనిషిని శాశ్వత వైకల్యం వైపు నెట్టేస్తుందని చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.