Blood pressure: అరటిపండుతో అధిక రక్తపోటుకు చెక్ పెట్టేయ్యండి.. రోజుకు ఎన్ని తినాలంటే..
ఆధునిక కాలంలో రక్తపోటు సమస్య అన్ని వయసుల వారికి సాధారణం అయిపోయింది. ఎక్కువమంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. మరోవైపు అధిక..
High Blood Pressure: ఆధునిక కాలంలో రక్తపోటు సమస్య అన్ని వయసుల వారికి సాధారణం అయిపోయింది. ఎక్కువమంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. మరోవైపు అధిక రక్తపోటు ఉందని తెలిసినా సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో ఆ సమస్య మరింత ఎక్కువైపోతుంది. అధికరక్తపోటు ఉన్న వారు నిర్లక్ష్యంగా ఉంటే అది మరింత ఎక్కువైపోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కేవలం వైద్యులు సూచించిన మందులతో పాటు ఆహార నియమాల్లో స్వల్ప మార్పులు చేసుకుంటే రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు కొందరు వైద్య నిపుణులు. సాధారణంగా అరటిపండు తినడం వలన రక్తపోటు అదుపులో ఉంటుందట. అయితే ఈఅరటి పండ్లు పరిమితంగా తినాలి. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం అరటిపండు తినే విషయంలో వైద్యులను సంప్రదించి వారి సలహా తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది.
అరటిపండ్లే కాకుండా, బచ్చలికూర, ఆకుకూరలు, ఓట్స్, పుచ్చకాయ, నారింజ, దుంపలు, క్యారెట్ వంటివి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండ్లను రోజూ తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంతో పాటు.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
అరటిపండు వల్ల కలిగే ప్రయోజనాల గురించివెలువడిన వివిధ అధ్యయనాల ప్రకారం పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగానూ, సోడియం తక్కువగానూ ఉంటాయి. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బులు ,స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని అదనపు సోడియం (Salt) రక్తనాళాలపై ఒత్తిడి తెచ్చి నీటి సమతుల్యతను దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, మూత్రపిండాలపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
శరీరంలోని అదనపు ఉప్పు మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. పొటాషియం శరీరంలో ద్రవం ,ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. అలా అని అరటిపండ్లు ఎక్కువుగా తినడం మంచిది కాదు. రోజూ పరిమిత సంఖ్యలో వీటిని తీసుకోవాలి. ఎక్కువుగా తినడం ద్వారా ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ.
రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి రోజుకు రెండు అరటిపండ్లు మాత్రమే తినాలి. దీని వల్ల రక్తపోటు 10 శాతం వరకు తగ్గుతుందని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. డయాబెటిస్ బాధపడేవారు అరటిపండ్లను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించి వారి సలహా తీసుకోవాలి. మధ్య తరహా అరటిపండులో 109 కేలరీలు, 18 గ్రాముల సహజ చక్కెర, 20 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1 గ్రాము ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. అరటిపండ్లలో విటమిన్ సి, ఫోలెట్, విటమిన్ ఎ కూడా ఉన్నాయి. అరటిపండ్లు పొటాషియం అద్భుతమైన మూలం. చిన్న అరటిపండులో 362 మిల్లీగ్రాములు, మధ్యస్థ అరటిపండులో 422 మిల్లీగ్రాములు, పెద్ద అరటిపండులో 487 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. పొటాషియం మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అందుకే అరటిపండ్లను తినడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..