క్యాబేజీలో ప్రాణాంతక పురుగులున్నాయా? బాలిక మృతితో కొత్త చర్చ.. వైద్యుల మాట ఇదే
క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి కూరగాయల్లో ఓ పురుగు ఉందని, అది ప్రాణాంతకమని ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, కొద్ది రోజుల క్రితం యూపీకి చెందిన ఓ బాలిక మెదడుకు సంబంధించిన వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఆమె క్యాబేజీలోని పురుగు కారణంగానే చనిపోయిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, వైద్యులు మాత్రం పురుగు కాకుండా పరాన్న జీవుల వల్ల ఇది జరిగి ఉంటుందని అంటున్నారు.

ఇటీవల సోషల్ మీడియాతో ఈ విషయంపై ప్రచారం జరిగింది. క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్లో చిన్నపాటి పురుగు ఉంటుంది. అది ఆహారం వండినప్పటికీ చనిపోదు. అంతేగాక, ఆ పురుగును తింటే మెదడుకు చేరుకుని ప్రాణాంతకంగా మారుతుంది. దీంతో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదే ప్రచారం గత కాలంగా సోషల్ మీడియాలో జరిగింది. కాగా, తాజాగా, ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన ఓ బాలిక ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో మరణించింది. ఆమె తలలో దాదాపు 25 గడ్డలు ఉన్నాయని ఎంఆర్ఐ స్కానింగ్లో తేలింది.
ఈ గడ్డలు క్యాబేజీ వల్ల సంభవించాయని వైద్యులు అనుమానిస్తున్నారు. క్యాబేజీలోని ఒక పురుగు మెదడులోకి చొరబడి ఆ బాలిక మరణానికి కారణమై ఉండొచ్చని సందేహిస్తున్నారు. అయితే, దీనిపై వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. క్యాబేజీలోని పురుగులు ప్రాణాంతకమనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ బయో టెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ కుమార్. క్యాబేజీలో మెదడుకు చేరే పురుగులు ఉంటాయని వైద్య శాస్త్రంలో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. నేలపై పెరిగే ఏ కూరగాయలలోనైనా టీ సోలియం అనే పరాన్న జీవి ఉంటుంది. అది మానవ విసర్జితం ద్వారా బయటకు వెళుతుందని చెప్పారు.
పరాన్న జీవి వల్ల కలిగే వ్యాధి సిస్టిసెర్కోసిస్
పరాన్న జీవులు కలిగిన కూరగాయలను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి కడుపులోకి ప్రవేశించి అక్కడ గుడ్లు పెడుతాయని డాక్టర్ అశోక్ తెలిపారు. పరాన్న జీవి గుడ్లతో ఇన్ఫెక్షన్ సిస్టిసెర్కోసిస్ వ్యాధికి కారణమవుతుందన్నారు. ప్రేగులలో పొదిగిన తర్వాత ఇతర శరీర కణజాలాలకు వలసపోతాయన్నారు. దీంతో తిత్తులుగా మారతాయన్నారు. అవి పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే లక్షణాలు చూపుతాయన్నారు. శరీరం అంతటా వ్యాపించినప్పుడు అవి న్యూరోసిస్టిసెర్కోసిస్ అనే వ్యాధికి కారణమవుతాయన్నారు.
క్యాబేజీ పురుగులు
క్యాబేజీలో ఎలాంటి పురుగులు ఉండకపోయినా.. పరాన్న జీవులు ఉంటాయని ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్ న్యూరో సర్జరీ యూనిట్ హెడ్ డాక్టర్ దల్జీత్ సింగ్ తెలిపారు. ఇవి ఉడికించని పంది మాంసం, పాలకూర, బ్రోకలీ, బెల్ పెప్పర్స్ వంటి కూరగాయలలో ఉంటాయన్నారు. అందువల్ల క్యాబేజీలో మాత్రమే మెదడుకు ప్రయాణించగల పురుగులు ఉన్నాయనడం తప్పు అని అన్నారు. ఇదంతా పరాన్న జీవుల వల్లే జరుగుతుందని చెప్పారు. పరాన్న జీవుల గురించి తెలియక ప్రజలు పురుగు అనుకుంటున్నారని తెలిపారు. ఈ పరాన్న జీవులు శరీరంలోని భాగాలతోపాటు మెదడుకు చేరుకుంటే ప్రాణాంతకం కావచ్చని తెలిపారు.
నివారణ ఏంటీ?
కూరగాయలను బాగా కడగడం, క్యాబేజీ లాంటి వాటికి మొదటి పొరను తీసేయడం చేస్తే పరాన్న జీవులు చనిపోతాయని వైద్యులు తెలిపారు. అవి కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉండదన్నారు. ఇన్ఫెక్షన్ మెదడుకు వెళ్లే వరకు ఆలస్యం చేస్తే చికిత్స చేయడం కష్టమవుతుందన్నారు. పరాన్న జీవులు కడుపులోనే ఉంటే వాటిని చంపడానికి మందులు వాడి, ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.
కూరగాయలను వండే ముందు, కొన్నింటిని నేరుగా తినే ముందు బాగా కడగాలని సూచిస్తున్నారు. క్యాబేజీ లాంటి వాటికి మొదటి పొర తొలగించండి. శుభ్రమైన ప్రదేశాలలో విక్రయించే కూరగాయలు కొనండి. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
