ఈ చిత్రంలో ఉంది విజయ నిర్మల మొదటి భర్త అనుకుంటున్నారా..?
దివంగత విజయనిర్మల తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటిగా, నిర్మాతగా, ప్రపంచ రికార్డు సాధించిన దర్శకురాలిగా చెరగని ముద్ర వేశారు. బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, వందలాది చిత్రాలలో నటించి, 44 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. ఆమె సినీ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో విజయనిర్మల ఒక అపురూప నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె తెలుగు సినిమాకు చేసిన సేవలు, సాధించిన విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1946 ఫిబ్రవరి 20వ తేదీన తమిళనాడులోని ఒక తెలుగు కుటుంబంలో విజయనిర్మల జన్మించారు. ఆమె తండ్రి సినీ నిర్మాత కావడంతో, సినిమా రంగం ఆమెకు బాల్యం నుంచే పరిచయమైంది. ఏడేళ్ల వయసులోనే మత్స్యరేఖ అనే తమిళ చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. పదకొండేళ్ల వయసులో, తెలుగులో పాండురంగ మహత్యం సినిమాతో బాలనటిగా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తరువాత కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి తన నటనకు మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత అటు బాలనటికి ఎక్కువ.. ఇటు హీరోయిన్ పాత్రలకు వయసు తక్కువ అవ్వడంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. 1962లో విజయ నిర్మలకు కేఎస్ మూర్తితో వివాహం జరిగింది. ఆయన షిప్ డిజైన్స్ తయారు చేసే ఇంజనీర్. ఈ దంపతులకే ఇప్పుడు నటుడిగా రాణిస్తున్న నరేష్ జన్మించాడు. సినిమాల్లో హీరోయిన్గా నటించాలని విజయ నిర్మల ఆరాటపడంతో.. ఆమె భర్త కేఎస్ మూర్తి ప్రొత్సహించారు. 1964వ సంవత్సరంలో ప్రేమ్ నజీర్ సరసన భార్గవి నిలయం అనే మలయాళ చిత్రంలో కథానాయికగా నటించి, ప్రధాన పాత్రలకు మారారు.
తెలుగులో రంగులరాట్నం సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసి తెలుగు వారికి చేరువయ్యారు. రంగులరాట్నం తర్వాత విజయనిర్మల తెలుగు చిత్రసీమలో ఒక ప్రముఖ నటిగా స్థిరపడ్డారు. ఆమె వెనుతిరిగి చూసుకోలేదు, తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. వారిలో సూపర్స్టార్ కృష్ణ గారితో ఆమెది ఒక విజయవంతమైన జంట. వీరిద్దరూ సుమారు 47 చిత్రాలలో కలిసి నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సినీ ప్రయాణంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, విజయనిర్మల, కృష్ణ గారు వివాహం చేసుకున్నారు. అప్పటికే విజయనిర్మలకి కేఎస్ మూర్తి అనే వ్యక్తితో వివాహం జరిగి నరేష్ అనే కుమారుడు ఉన్నారు. అలాగే, కృష్ణ గారికి కూడా అప్పటికే ఇందిరా దేవితో వివాహం జరిగి రమేష్ బాబు, మహేష్ బాబు అనే ఇద్దరు కుమారులు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్తకు విడాకులు ఇచ్చి కృష్ణను పెళ్లాడారు విజయ నిర్మల. కృష్ణ మాత్రం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే.. రెండో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి పెద్ద నటుడు చంద్రమోహన్. అయితే విజయ నిర్మల మొదటి భర్త ఈయనే అంటూ పైన ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ అది రాంగ్. అందులో విజయ నిర్మలతో పాటు ఉన్నది.. మలయాళ హీరో ప్రేమ్ నజీర్, మలయాళ దర్శకుడు వేణు. ఆమె మొదటి భర్త ఫోటో ఎక్కడా అందుబాటులో లేదు.
విజయనిర్మల నటిగా మాత్రమే కాకుండా, దర్శకురాలిగానూ తన అద్భుత ప్రతిభను చాటుకున్నారు. ఆమె 200కు పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. ఆమె సుమారు 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు, ఇది ఒక మహిళా దర్శకురాలికి అరుదైన, గొప్ప రికార్డు. తన స్వీయ దర్శకత్వంలో కృష్ణ గారితో హేమా హేమీలు వంటి పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. దర్శకురాలిగా ఆమె విజయం, మహిళలు సినీ రంగంలో ముఖ్యమైన సాంకేతిక విభాగాలలో రాణించగలరని నిరూపించింది. దర్శకురాలిగానే కాకుండా, కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించి సినిమా నిర్మాణ రంగంలో తన పాత్రను పోషించారు. విజయనిర్మల గారి సినీ జీవితం, ఆమె సాధించిన ఘనతలు తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి.
