
పద్మశ్రీ అవార్డు గ్రహిత వనజీవి రామయ్య జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కుతోంది. ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలో శుక్రవారం షూటింగ్ కార్యక్రమాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారి సిద్దార్థ్ ప్రారంబించారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ వనజీవి రామయ్యగా నటిస్తున్నారు. కోటికి పైగా చెట్లని నాటుతూ ఆఖరి నిమిషం వరకూ వనజీవి రామయ్య ప్రజాశ్రేయస్సు, ప్రకృతి కోసం పాటుపడ్డారని.. తన జీవిత కథనం ఇప్పటికే పాఠ్యంశాల్లో చేర్చారని మూవీ యూనిట్ తెలిపారు. ఆయన ఇప్పుడుమన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని తెలిపారు.
కోటి మొక్కల రామయ్యగా.. వనజీవి రామయ్యగా ప్రసిద్ధుడైన రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య గురించి తెలియని వారుండరు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ఆయనదో ప్రత్యేక శైలి.
వృక్షో రక్షతి రక్షితః అన్న నినాదాలు రాసి ఉన్నగుండ్రని ప్రకార్డును తగిలించుకొని.. ఊరూరూ తిరుగుతూ ఆయన చేసిన పర్యావరణ పరిరక్షణ ప్రచారం అందరికీ తెలిసిందే. ఇక శుభకార్యాలకు హాజరైన సందర్భాల్లో మొక్కలను బహుమతులుగా అందించడం ఆయన ప్రత్యేకత. అలాగే వివిధ చెట్టు నుంచి గింజలను సేకరించి అటవీప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో చల్లడం ఆయనకు అలవాటు. అలాంటి రామయ్య ఈ ఏడాది ఏప్రిల్లో..ప్రకృతి ఒడిలో ఒదిగిపోయారు. తన తుది శ్వాస వరకు పర్యావరణం కోసమే తపించిన వన జీవి చరిత్ర అందిరికీ గుర్తుండిపోయేలా ఆయన జీవిత చరిత్ర ఇప్పుడు వెండితెరపైకి ఎక్కిస్తున్నారు. ఆయన జీవిత చరిత్రే కథాంశంగా చలన చిత్రాన్ని తీయబోతున్నారు.
నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా… బల్లేపల్లి మోహన్ సంగీతం అందిచనున్నారు. ఈ నెల 21న ఖమ్మం నగరంలోని బల్లేపల్లిలోని నేచర్ వ్యాలీలో చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.. కోటి మొక్కలు నాటిన దరిపల్లి రామయ్య జీవిత చరిత్ర బావి తరాలకు తెలియజేసి స్పూర్తిని కలిగించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్ర నిర్మాణం చేపట్టామని మూవీ యూనిట్ తెలిపారు. మొక్కల ప్రేమికుడు, ప్రకృతిసహవాసి రామయ్యకు నివాళిగా చిత్రాన్ని సమర్పిస్తున్నామన్నారు. ఈ సినిమాలో పలువురుసీనియర్ నటులతోపాటు, వనజీవి రామయ్యకు సన్నిహతులు కొందరు నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..