AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తేనె మనసులు మూవీ హీరోయిన్ సుకన్య ఏమయ్యారు..?

తేనె మనసులు చిత్రంతో పరిచయమైన నటి సుకన్య సినీ ప్రస్థానం అసంపూర్ణంగా ముగిసింది. అప్పటికే వివాహమైన సుకన్య, కుటుంబాన్ని వదులుకుని సినిమాల్లోకి ప్రవేశించారు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, రచయిత ఆచార్య ఆత్రేయతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నట్లు పరిశ్రమ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఆమె తక్కువ చిత్రాల్లో నటించి, 1990లో కన్నుమూశారు.

Tollywood: తేనె మనసులు మూవీ హీరోయిన్ సుకన్య ఏమయ్యారు..?
Actress Sukanya
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2026 | 12:51 PM

Share

తెలుగు సినీ చరిత్రలో 1965వ సంవత్సరం కీలకమైనది. అప్పట్లో ఒకరిద్దరు కొత్త నటులను పరిచయం చేయడానికే నిర్మాతలు వెనుకడుగు వేసేవారు. అలాంటి సమయంలో, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తేనె మనసులు చిత్రంతో సాహసోపేతంగా 12 మంది ప్రధాన పాత్రధారులను, 10 మంది ఉప పాత్రధారులను పరిచయం చేశారు. ఈ చిత్రంతోనే రామ్మోహన్, కృష్ణ హీరోలుగా.. సుకన్య, సంధ్యారాణి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. 1964 మార్చి 16న హైదరాబాద్‌లో తేనె మనసులు చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. కొత్త నటీనటులకు సినిమా నటనకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు ఆదుర్తి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వారికి భయం పోవడానికి, స్వేచ్ఛగా మెలగడానికి పిక్నిక్‌లకు, బీచ్‌లకు తీసుకువెళ్లి డైలాగులు ప్రాక్టీస్ చేయించేవారు. అసోసియేట్ డైరెక్టర్ కె. విశ్వనాధ్ కూడా ఈ శిక్షణలో పాలుపంచుకున్నారు. తేనె మనసులు తర్వాత కృష్ణ, రామ్మోహన్ మరిన్ని అవకాశాలు పొందగా, కృష్ణ సూపర్ స్టార్‌గా ఎదిగారు. సంధ్యారాణి సహాయ పాత్రలు, హాస్య పాత్రల్లో కొనసాగారు.

అయితే వీరందరిలో సుకన్య సినీ ప్రస్థానం అంతగా సాగలేదు. రాజమండ్రిలో పుట్టిన సుకన్యకు నాటకానుభవం లేనప్పటికీ, చిన్నతనం నుంచే సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. తేనె మనసులు కోసం ప్రకటన రాగానే దరఖాస్తు చేసుకున్న ఆమె, జయలలిత, హేమమాలిని వంటి వారిని అధిగమించి హీరోయిన్‌గా ఎంపికయ్యారు. తేనె మనసులులో ఆమె భానుమతి పాత్రలో రామ్మోహన్‌కు జోడీగా నటించారు. ఈ చిత్రంలో నటించే సమయానికి సుకన్యకు వివాహమై, ఒక కూతురు కూడా ఉన్నారు. ఆమె భర్తకు మంచి ఉద్యోగం ఉండగా, జర్మనీ వెళ్లాల్సి వచ్చింది. భార్యాకూతురితో కలిసి వెళ్లాలని ఆయన కోరినా, సుకన్య సినిమాల్లోకి వెళ్లాలనే పట్టుదలతో నిరాకరించారు. భర్త, కుటుంబ సభ్యులు నచ్చచెప్పినా ఆమె మనసు మార్చుకోలేదు. సుకన్య స్క్రీన్ టెస్ట్‌లో నెగ్గి, తల్లిని, కూతురిని తీసుకొని మద్రాస్ బయలుదేరారు. తేనె మనసులు తర్వాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోనే కన్నె మనసులు చిత్రంలో కూడా ఆమె రామ్మోహన్ సరసన నటించారు. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ సమయంలో కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి స్నేహంగా మెలిగారు. తేనె మనసులు హైదరాబాద్‌లో, కన్నె మనసులు చెన్నైలో చిత్రీకరణ జరిగాయి. షూటింగ్‌లు పూర్తయిన తర్వాత సుకన్య బయటి చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. తనకు తొలి అవకాశం ఇచ్చిన ఆదుర్తి సుబ్బారావును తరచుగా కలిసేవారు. సుకన్య అందం, చలాకీతనం ఆదుర్తిని ఆకర్షించగా, ఆయన ఆమెపై మనసు పడ్డారు. అప్పటికే వివాహితుడైన ఆదుర్తి, సుకన్యతో తన అభిప్రాయాన్ని నేరుగా పంచుకున్నారు. పెద్ద దర్శకుడి అండ తనకు మంచిదని భావించిన సుకన్య అభ్యంతరం చెప్పలేదు. వీరిద్దరి సహజీవనం ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలో చాలామందికి తెలుసు.

ఆ తర్వాత సుకన్య చాలా తక్కువ చిత్రాల్లో నటించారు. వీటిలో కాంతారావు, కృష్ణ హీరోలుగా నటించిన ఇద్దరు మొనగాళ్లు, బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో రంగులరాట్నం, ఆదుర్తి దర్శకత్వంలో సుడిగుండాలు చిత్రాలున్నాయి. నిశిరాత్రి 12 గంటలు అనే చిత్రంలో నటించినా అది విడుదల కాలేదు. ఆదుర్తి సుబ్బారావు తర్వాత సుకన్య రచయిత ఆచార్య ఆత్రేయతో సహజీవనం చేశారని ఆనాటి చిత్ర ప్రముఖులు పేర్కొన్నారు. తన ఏకైక కుమార్తెకు నిర్మాత ఎస్. భావనారాయణ కుమారుడితో వివాహం చేశారు సుకన్య. ఈ వివాహం వెనుక ఆచార్య ఆత్రేయ సహకారం ఉందని చెబుతారు. కూతురి వివాహం తర్వాత బాధ్యతలు తీరిపోవడంతో, సుకన్య 1990లో ప్రశాంతంగా కన్నుమూశారు.

(ఈ కథనం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులతో పాటు ఇంటర్నెట్‌లో అందుబాటులో సమాచారం అనుగుణంగా ఇవ్వబడింది)

Follow Us