Sarath Babu: వెండి తెరపై వెలిగిన నటులలో శరత్బాబుది ప్రత్యేకమైన స్థానం..
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్సాబ్లో చివరి సారి స్క్రీన్ మీద కనిపించారు. మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారమ్మా బంగారయ్యా...

శరత్బాబు పూర్తి పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జులై 31న ఆమదాలవలసలో జన్మించారు. 1973లో రామరాజ్యంతో సినీ రంగ ప్రవేశం చేశారు శరత్బాబు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేశారు. పవన్ కల్యాణ్ నటించిన వకీల్సాబ్లో చివరి సారి స్క్రీన్ మీద కనిపించారు. మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారమ్మా బంగారయ్యా… మూడు ముళ్ల బంధం, సీతాకోక చిలుక, స్వాతిముత్యం, జీవనజ్యోతి… అభినందన, స్వాతిచినుకులు, ఆపద్బాంధవుడు, నువ్వు లేక నేను లేను… శంకర్దాదా జిందాబాద్, శ్రీరామదాసు, ఆట, శౌర్యం, సాగరసంగమం… షిరిడిసాయి, ఎంత మంచివాడవురా, వకీల్ సాబ్ చిత్రాల్లోని పాత్రలకు మంచి గుర్తింపుదక్కింది.
హీరోయిన్లకు సోదరుడిగా, మధ్యతరగతి మనిషిగా, ప్రలోభాలకు గురైన వ్యక్తిగా, హీరోకి స్నేహితుడిగా, ప్రతినాయకుడిగా, సిట్చువేషన్స్ కి తగ్గట్టు ప్రవర్తించే వ్యక్తిగా ఎన్నో రకాల పాత్రల్లో మెప్పించారు శరత్బాబు. బాలచందర్, కె.విశ్వనాథ్, రజనీకాంత్, చిరంజీవి సినిమాల్లో శరత్బాబు పాత్రలను జనాలు అంత తేలిగ్గా మార్చిపోలేరు. సోషల్ సినిమాలు మాత్రమే కాదు పౌరాణిక, జానపద, భక్తి చిత్రాలతోనూ మెప్పించారు శరత్బాబు. గంభీరమైన స్వరంతో ఆయన చెప్పే డైలాగులకు ప్రత్యేకమైన అభిమానులున్నారు. తెలుగు, తమిళంలో ఆయన డైలాగులు చెప్పే తీరు తనకు చాలా ఇష్టమని కె.విశ్వనాథ్ పలు సందర్భాల్లో చెప్పారు.
తెలుగులో సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజనం చిత్రాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నందులు అందుకున్నారు. తమిళనాడు, కేరళ స్టేట్ అవార్డులు కూడా అందుకున్న ఘనత ఆయనది. సిల్వర్స్క్రీన్ మీద వెలుగుతూ టీవీల్లో నటించిన నటుల్లో శరత్బాబుది ప్రత్యేకమైన స్థానం. తమిళ దూరదర్శన్లో వచ్చే పలు ధారావాహికల్లో నటించారు. తెలుగులోనూ పలు సీరియళ్లలో నటించారు.




