
సినీ నటుడు నరసింహరాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ సుదీర్ఘ సినీ ప్రస్థానం, ఎదుర్కొన్న వివాదాలు, వ్యక్తిగత జీవితంపై అనేక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులపై ఆయన నోటి దురుసు వ్యాఖ్యలు చేశారని, దాని వల్ల ఆఫర్లు తగ్గి ఇండస్ట్రీ దూరంగా పెట్టిందని ప్రచారంలో ఉన్న వార్తలపై స్పందించారు. ఈ ప్రచారం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజుల్లో యువకుడిగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండటం వల్ల ఏదో ఒకటి మాట్లాడి ఉండవచ్చని, పత్రికల వాళ్ళు దానిని అతిశయోక్తిగా రాశారని అన్నారు. ఆ సంఘటనల తర్వాత కూడా తాను ఏఎన్ఆర్ గారితో మూడు సినిమాలు చేశానని, ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిమంది మంత్రుల మధ్య నుంచి వచ్చి తనను ఆప్యాయంగా కౌగిలించుకుని మాట్లాడారని గుర్తుచేసుకున్నారు. కేవలం చూడటానికి మాత్రమే వెళ్లానని, సహాయం కోరలేదని వివరించారు.
యూట్యూబ్లో వచ్చే రూమర్ల మాదిరిగానే అప్పట్లో కూడా కొన్ని విషయాలు ఎక్కువ ప్రచారం పొందాయని అన్నారు. నరసింహరాజు తమ కెరీర్లోని మరో కీలక ఘట్టం “జగన్మోహిని” సినిమా గురించి మాట్లాడారు. తనపై వ్యతిరేక ప్రచారం జరుగుతున్న సమయంలోనే “జగన్మోహిని” సినిమా విడుదలైందని, కృష్ణ గారి “సింహబలుడు,” “సింహగర్జన” వంటి భారీ చిత్రాలతో పోటీ పడి విజయవంతమైందని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని, తద్వారా సినిమా హిట్ అయ్యిందని చెప్పారు. “జగన్మోహిని” చిత్రంలో తన సహనటి జయమాలిని గురించి మాట్లాడుతూ, ఆమె అందంగా, సన్నగా ఉండేవారని, అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ఆ సినిమా తర్వాత జయమాలినికి మంచి మార్కెట్ వచ్చిందని, శోభన్ బాబు గారి లాగే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు సినిమాలకు దూరం అయి మంచి జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అనురాధ, స్మిత వంటి నటీమణులకు ఒకానొక సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదని పేర్కొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదలపై నరసింహరాజు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “పునాదిరాళ్లు” సినిమాలో చిరంజీవి పాటలు వస్తున్నప్పుడు ఆయన రిక్షాల మీద తిరిగే గ్రామఫోన్ రికార్డ్స్కి డాన్స్ సాధన చేసేవారని, అప్పటి నుంచే ఆయన అంకితభావాన్ని, కృషిని తాను గమనించానని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి గొప్ప నటుడు అవుతాడని తాను అప్పుడే ఊహించానని, ఆయన కృషి, మంచి మనసు, అదృష్టం కలిసొచ్చి ఈరోజు ఇండస్ట్రీకే బాస్గా ఎదిగారని ప్రశంసించారు. పక్కనున్నవారు ఎదిగితే తనకు సంతోషమే అని, వారి పరిచయాలు కష్ట సమయాల్లో ఉపయోగపడతాయని నరసింహరాజు అన్నారు.