Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా? సెలబ్రిటీ కోచ్ చెప్పింది ఏంటి
ప్రస్తుతం కండరాల పుష్టి కోసం, వ్యాయామం తర్వాత అలసట తగ్గించుకోవడానికి చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి రకరకాల ప్రోటీన్ పొడులు, మాత్రలు వాడుతున్నారు. అయితే, ఎంతో మంది కలలు కనే మెరిసే చర్మం, కాంతి, మిల్కీ బ్యూటీ తమన్నా సొంతం.

రంగురంగుల డబ్బాల్లో వచ్చే ఈ కృత్రిమ ఆహారాల కంటే మన వంటింట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే పసుపు ఎంతో మేలైనదని ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ శిక్షకుడు సిద్ధార్థ్ సింగ్ చెబుతున్నారు. ప్రముఖ నటి తమన్నా భాటియాను శారీరక సౌందర్యం విషయంలో తీర్చిదిద్దిన ఆయన పసుపును అత్యంత తక్కువ ధరలో లభించే సూపర్ ఫుడ్ గా అభివర్ణించారు. శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో తయారు చేసే ఖరీదైన సప్లిమెంట్ల కంటే పసుపు అద్భుతంగా పనిచేస్తుందని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
పసుపులో దాగి ఉన్న అద్భుత శక్తి..
పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో వచ్చే వాపులను, అంతర్గత గాయాలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నేటి కాలంలో చాలామందిని వేధిస్తున్న జీర్ణక్రియ సమస్యలు, మెదడు మొద్దుబారిపోవడం వంటి ఇబ్బందులకు కర్కుమిన్ ఒక గొప్ప పరిష్కారం. అందుకే మన పెద్దలు పూర్వం నుండి ప్రతి కూరలోనూ పసుపును తప్పనిసరిగా వాడేవారు. పసుపు కేవలం రంగు కోసం మాత్రమే కాదు అది శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సిద్ధార్థ్ సింగ్ అభిప్రాయం ప్రకారం కేవలం ఇరవై రూపాయల లోపు లభించే పసుపు మార్కెట్లో దొరికే వేల రూపాయల సప్లిమెంట్లను మించిపోతుంది.
సహజ సిద్ధమైన వరం..
నిరంతరం వ్యాయామం చేసేవారు లేదా ఆటలు ఆడే వారికి పసుపు ఒక సహజమైన స్టెరాయిడ్ లాగా ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, వ్యాయామం తర్వాత కండరాలు త్వరగా కోలుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పసుపును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ శుద్ధి అవుతుంది. దీనివల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడి మనిషిలో ఉత్సాహం మరియు శక్తి పెరుగుతాయి. పసుపు వల్ల కలిగే ఈ ప్రయోజనాలను గమనించే విదేశీయులు కూడా ఇప్పుడు దీనిని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. మన అమ్మలు ప్రతిరోజూ పప్పులో లేదా కూరల్లో పసుపు వేయడం వెనుక ఇంతటి గొప్ప ఆరోగ్య రహస్యం దాగి ఉంది.
View this post on Instagram
పోషకాలను పెంచే చిట్కా..
పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం మన శరీరంలోకి సంపూర్ణంగా గ్రహించబడాలంటే ఒక చిన్న రహస్యం ఉంది. పసుపును ఎప్పుడూ మిరియాల పొడితో కలిపి తీసుకోవాలి. పసుపులో మిరియాల పొడిని చేర్చడం వల్ల మన శరీరం పసుపును గ్రహించే సామర్థ్యం సుమారు రెండు వేల శాతం పెరుగుతుంది. మిరియాలు లేకుండా పసుపు తీసుకుంటే అందులోని పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందవు. కాబట్టి పాత కాలపు ఆయుర్వేద విజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయకుండా వంటింట్లో లభించే ఇలాంటి సహజ సిద్ధమైన ఆహారాలను ప్రాధాన్యత ఇవ్వాలి. ఖరీదైన డబ్బాల్లో దొరికేవన్నీ మేలైనవి కావని మనం గుర్తుంచుకోవాలి.
