
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. అతనిపై మరో పోలీస్ కేసు నమోదైంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఇవాళ ఉదయం నర్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చి హీరోపై ఫిర్యాదు చేసింది. జూన్ 30న రాజ్ తరుణ్, అతని సహచరులు తనను, తన కుటుంబాన్ని బెదిరించారని లావణ్య తన వాంగ్మూలంలో పేర్కొంది. అంతేకాకుండా వారు తన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని కూడా ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. దీనిని అడ్డుకున్న తన తండ్రిపై కూడా దాడి చేశారని.. తన పెంపుడు కుక్కను సైతం చంపారని లావణ్య వాపోయింది. ఈ ఫిర్యాదు మొదట హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు చేరడంతో.. ఆయన ఆదేశాల మేరకు.. నర్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్ తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కేసు నమోదు చేశారు.
కాగా 2016లో రాజ్ తరుణ్తో కలిసి కోకాపేట్లోని విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని, ప్రస్తుతం తాము మాత్రమే ఉన్నామంది. అయితే విల్లాలో తాను నివసిస్తున్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారని, బెల్టులు, గాజు సీసాలతో కొట్టి తాను ధరించిన బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని లావణ్య ఆరోపించింది. ఇంకా, ఆ ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే ఈ దాడి జరిగిందని వాపోయింది. ఈ కేసును పోలీసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరి లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
కాగా గతంలో రాజ్ తరుణ్ ,లావణ్యలు పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు తనతో ఉండి, ఆ తర్వాత హ్యాండిస్తున్నాడని, మరో హీరోయిన్తో క్లోజ్గా ఉంటున్నాడని, తన వద్దకు రావడం లేదని, తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తూ లావణ్య కేసు పెట్టింది. ఈ కేసు కోర్ట్ వరకు వెళ్లింది. రాజ్ తరుణ్, లావణ్యల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలవుతున్నాయి. అయితే గత కొంత కాలం స్తబ్ధుగా ఉన్న వీరిద్దరి వ్యవహారం మళ్లీ ఇప్పుడు లావణ్య కేసుతో తెర మీదకు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.