AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ విగ్రహం ప్రముఖ తెలుగు నటుడిది..? ఎవరిదో మీరు గుర్తుపట్టారా..?

దివంగత తెలుగు నటుడు అచ్యుత్‌ను మరోసారి గుర్తుచేసుకుంటూ ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కృష్ణాజిల్లా పర్యటనలో అచ్యుత్ విగ్రహం వద్ద ఫొటో తీసుకున్న ఆయన.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1990ల నుంచి తెలుగు సినిమా, టెలివిజన్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన అచ్యుత్..

ఈ విగ్రహం ప్రముఖ తెలుగు నటుడిది..? ఎవరిదో మీరు గుర్తుపట్టారా..?
Achyuth Statue -Kadambari Kiran
Ram Naramaneni
|

Updated on: Aug 21, 2026 | 7:19 AM

Share

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఇటీవల కృష్ణాజిల్లా వెళ్లారు. అక్కడ దివంగత తెలుగు నటుడు అచ్యుత్ విగ్రహం వద్ద ఓ ఫోటో తీసుకోని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. తెలుగు ప్రేక్షకులకు అచ్యుత్ అంటే కేవలం ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు.. 1990ల నుంచి 2000ల ప్రారంభం వరకు వెండితెర, బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన నటుడు. హీరోగా పెద్ద సంఖ్యలో సినిమాలు చేయకపోయినా.. సహాయ నటుడిగా, సీరియల్ నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ‘గోకులంలో సీత’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘బావగారు బాగున్నారా?’, ‘నరసింహనాయుడు’ వంటి సినిమాల్లో ఆయన కనిపించిన తీరు ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.

మచిలీపట్నం నుంచి నటుడిగా..

అచ్యుత్ అసలు పేరు కూనపరెడ్డి అచ్యుత వర ప్రసాద్‌. 1960లో మచిలీపట్నంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. 1991లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ‘ప్రేమ ఎంత మధురం’ వంటి ప్రారంభ కార్యక్రమాల నుంచి ఆయన బుల్లితెర ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘హిమబిందు’, ‘స్త్రీ’,’సీతాపతి’, ‘క్రాంతిరేఖ’, ‘అంతరంగాలు’, ‘అన్వేషిత’, ‘అనుబంధం’ వంటి సీరియళ్లలో కీలక పాత్రలు పోషించారు.

ఒక దశలో తెలుగు టెలివిజన్‌లో ప్రసారమయ్యే దాదాపు అన్ని ప్రధాన ప్రైమ్‌టైమ్ సీరియళ్లలోనూ అచ్యుత్ కనిపించేవారంటే అతిశయోక్తి కాదు. ‘హిమబిందు’, ‘అన్వేషిత’, ‘అంతరంగాలు’ వంటి సీరియళ్లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ‘అంతరంగాలు’లో నటనకు నంది అవార్డు కూడా అందుకున్నారు.

వెండితెరపై ప్రత్యేక గుర్తింపు

టెలివిజన్‌లో పేరు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లోనూ అచ్యుత్ బిజీ అయ్యారు. ‘తాజ్ మహల్’ ఆయన నటించిన తొలి సినిమాగా చెబుతున్నప్పటికీ, విడుదలైన తొలి చిత్రం ‘మంగళ్య బలం’ అని సినీ ప్రముఖులు వెల్లడించారు. తన కెరీర్‌లో 50కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు.

పవన్ కల్యాణ్‌తో ‘గోకులంలో సీత’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’ సినిమాల్లో నటించడం ఆయనకు మరింత గుర్తింపు తెచ్చింది. ‘బావగారు బాగున్నారా?’, ‘కలిసుందాం రా’, ‘నరసింహనాయుడు’, ‘సింహరాశి’, ‘మురారి’, ‘డాడీ’, ‘అల్లరి రాముడు’, ‘వాసు’ వంటి సినిమాల్లోనూ కనిపించారు. ‘ఒక్కడు’లో ఆయన నటించిన పాత్ర ఆయన మరణం తర్వాత విడుదలైంది.

అచ్యుత్ కేవలం నటుడిగానే కాకుండా టెలివిజన్ సీరియళ్ల నిర్మాణంలోనూ భాగమయ్యారు. నటుడు ప్రదీప్, మరికొందరితో కలిసి సీరియళ్లను నిర్మించినట్టు సమాచారం. ఆయన మరణానికి ముందు ‘మట్టి మనుషులు’ సీరియల్ నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు.

ప్రదీప్‌తో అన్నదమ్ముల్లాంటి అనుబంధం

అచ్యుత్‌కు నటుడు ప్రదీప్‌తో ఎంతో సన్నిహిత సంబంధం ఉండేది. ఇద్దరూ కలిసి సీరియళ్లలో పనిచేశారు. ఆ పరిచయం క్రమంగా ఆత్మీయ స్నేహంగా మారిందని ప్రదీప్ ఇటీవల వెల్లడించారు. అచ్యుత్‌ను తాను సొంత అన్నదమ్ముడిలాగే భావించేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్.. అచ్యుత్ చివరి రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అచ్యుత్ మరణానికి ముందు రోజు కూడా తాను ఆయనతో మాట్లాడానని, షూటింగ్‌కు వెళ్తున్నానని అచ్యుత్ చెప్పాడని ప్రదీప్ వెల్లడించారు. ఆ సమయంలో అచ్యుత్ కొంత ఆయాసంగా మాట్లాడటం తాను గమనించానని తెలిపారు.

చివరి రోజు ఏం జరిగింది?

2002 డిసెంబర్ 26. అచ్యుత్‌కు ఉదయం ఛాతిలో నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో అదే రోజు ఆయన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 41 సంవత్సరాలు. అచ్యుత్ మరణానికి కారణం గుండెపోటుగా అప్పటి వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణం తెలుగు టెలివిజన్, సినిమా రంగాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇటీవల అచ్యుత్ స్నేహితుడు ప్రదీప్ చెప్పిన వివరాల ప్రకారం.. అచ్యుత్ ఆరోగ్య పరిస్థితి బయటకు కనిపించినంతగా బాగోలేదని ఆయనకు అనిపించిందట. అచ్యుత్ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేదని ప్రదీప్ చెప్పారు. అయితే ఇవి ప్రదీప్ వ్యక్తిగతంగా వెల్లడించిన విషయాలు మాత్రమే; అచ్యుత్ మరణానికి వైద్యపరమైన అధికారిక కారణంగా అప్పటి వార్తలు మాత్రం గుండెపోటునే పేర్కొన్నాయి.

ఇంకా ఎదగాల్సిన సమయంలోనే..

అచ్యుత్ కెరీర్ అప్పటికి మంచి ఊపులో ఉంది. సినిమాలతో పాటు టీవీ రంగంలోనూ ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. దాదాపు దశాబ్దం పాటు సాగిన కెరీర్‌లో 50కి పైగా సినిమాలు, అనేక టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

హీరోగా భారీ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించకపోయినా.. ఆయన చేసిన పాత్రలు మాత్రం ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా 1990ల తరం ప్రేక్షకులకు అచ్యుత్ పేరు చెప్పగానే సీరియళ్లు, కుటుంబ కథలు, పవన్ కల్యాణ్ సినిమాల్లో కనిపించిన ఆ పరిచయమైన ముఖం గుర్తుకొస్తుంది.

కేవలం 41 ఏళ్ల వయసులోనే ఆయన జీవితం ముగిసిపోవడం తెలుగు చిత్ర, టెలివిజన్ రంగానికి తీరని లోటుగా మిగిలింది. ఆయన మరణించి రెండు దశాబ్దాలకు పైగా గడిచినా.. ‘తమ్ముడు’, ‘తొలిప్రేమ’, ‘గోకులంలో సీత’ వంటి సినిమాలు టీవీలో కనిపించిన ప్రతిసారీ అచ్యుత్‌ను ప్రేక్షకులు మరోసారి గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.

Follow Us