
ముక్కు అవినాష్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన కామెడీ టైమింగ్, పంచులు, ప్రాసలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు అవినాష్. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయ్యాడీ కమెడియన్. అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పార్టిసిపేట్ చేసి బుల్లితెర అభిమానులకు మరింత చేరువ అయ్యాడు. ప్రస్తుతం ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కుకు విత్ జాతిరత్నాలు టీవీ షోలతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు అవినాష్. అయితే స్క్రీన్ పై ఎప్పుడూ నవ్వుతూ కనిపిచే అవినాష్ జీవితంలోనూ కొన్ని విషాదాలు దాగి ఉన్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ‘కాకమ్మ కథలు’ పేరుతో ఓ టాక్ షో నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటి తేజస్విని మదివాడ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ టాక్ షోకు హాజరయ్యాడు అవినాష్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇదే క్రమంలో తన జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
ఈషోలో భాగంగా యాంకర్ ..’మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషాదకర సంఘటన ఏదైనా ఉందా? అని అడగగా.. అవినాష్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయిన అతను ‘ ఈ మధ్య కాలంలో నా జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నా మొదటి బిడ్డను కోల్పోయిన రోజు నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఆ రోజు ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు కనిపించిన ప్రతివారి కాళ్లపై పడ్డాను. నా బిడ్డను కాపాడాలని దీనంగా వేడుకున్నాను. కానీ ఏమీ చేయలేకపోయాను. ఆస్పత్రి బయట పిచ్చోడిలా అటూ ఇటూ తిరిగాను. రోడ్డుపై పడుకుని మట్టిలో దొర్లాను. ఆ సమయంలో నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియలేదు. ఈ బాధను తట్టుకోలేక చాలా రోజుల పాటు బయట ప్రపంచానికి దూరంగా ఉన్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకున్న షూటింగ్ యూనిట్ సభ్యులు మరుసటి రోజు షూటింగ్ను కూడా రద్దు చేశారు’ అని అప్పటి విషాదాన్ని గుర్తు చేసుకున్నాడు అవినాష్.
ఈ విషాదం తర్వాత అవినాష్ కు పండంటి బాబు జన్మించాడు. అతనికి ‘అద్వైత్’అనే పేరు పెట్టారు. ఇటీవలే కుమారుడు అద్వైత్ తొలి పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి