
ప్రముఖ హాస్యనటుడు గుండు సుదర్శన్ ఇటీవల ఓఇంటర్వ్యూలో తెలుగు చిత్ర పరిశ్రమలోని తన అనుభవాలను, పరిశ్రమ పరిణామాలు, అలాగే ఓ స్టార్ హీరోతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అనేక మంది కళాకారులు రకరకాల బాధలతో భాగ్యనగరానికి వస్తారని, కృష్ణానగర్ కథలు ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. పూర్వీకుల సంపాదనతో కాకుండా, స్వయంకృషితో నిలబడటంలో గొప్ప తృప్తి ఉందని, ఆకలి, అవమానాల నుంచే నిజమైన ప్రేరణ వస్తుందని సుదర్శన్ తెలిపారురు. ప్యాషన్ ఉన్నవారికి కడుపులో గానీ, గుండెలో గానీ మంట ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలో అవమానాలు సాధారణమని, పెద్ద ఆర్టిస్టులను ఒకలాగా, చిన్న ఆర్టిస్టులను మరొకలాగా చూసే ధోరణి కొంత ఉందని ఆయన అన్నారు. ఒకప్పుడు హాస్పిటాలిటీలో తేడా ఉండేదని, క్యారవాన్లు లేక చెట్ల కిందే బట్టలు మార్చుకుని షూటింగ్లకు వెళ్లిన రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు క్యారవాన్లు, డ్రెస్ చేంజింగ్ రూమ్లు వంటి సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయని, ఇది లగ్జరీ కాదని, ఒక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జూనియర్ ఆర్టిస్టులకు కూడా ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారని, మార్పు అనేది సహజమని పేర్కొన్నారు.
అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదగడం తెలుగువారందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ తెలుగు సినిమాలను, హీరోలను పట్టించుకోలేదని, కానీ నేడు అందరూ టాలీవుడ్ వైపు చూస్తున్నారని, తెలుగు నటులకూ, టాలీవుడ్కూ ఒక గౌరవం దక్కుతోందని సుదర్శన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది మన హీరోలు, డైరెక్టర్ల కృషి వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, ఆయన దర్శకుల నటుడని, చెప్పింది తూచా తప్పకుండా చేస్తారని ప్రశంసించారు. మహేష్ బాబు సెట్లో చాలా సరదాగా ఉంటారని, ఆయన జోక్లను ఆస్వాదిస్తే చాలని, ఆయనలో అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని తెలిపారు. చాలామంది మహేష్ బాబును సీరియస్గా ఉంటారని భావిస్తారని, కానీ ఆయన అలా కాదని, వండర్ఫుల్ వ్యక్తి అని గుండు సుదర్శన్ తెలిపారు. నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన సంస్కారం, వినయం మహేష్లో స్పష్టంగా కనిపిస్తాయని, సెట్లో ఎక్కడా తాను స్టార్నన్న భావన ఉండదని, అదే నిరాడంబరత, ఆప్యాయతను ప్రదర్శిస్తారని ఆయన అన్నారు. నలుగురితో కలిసి కూర్చోవడం వంటి గుణాలు మహేష్ను గొప్ప స్టార్గా నిలబెట్టాయని సుదర్శన్ పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.