
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో వార్తల్లో నిలిచిన నిధి అగర్వాల్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆమెను సుదీర్ఘంగా విచారించిన దర్యాప్తు సంస్థ.. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసింది. ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వివరాలు, ప్రమోషనల్ కాంట్రాక్ట్ల గురించి ప్రశ్నించింది. యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను తీసుకున్న రెమ్యునరేషన్పై వివరాలు సేకరించారు అధికారులు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి నిధి అగర్వాల్ ఖాతాకు బదిలీ అయిన డబ్బు గురించి ప్రశ్నలు సంధించారు. మనీ లాండరింగ్ వ్యవహారంపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఓ నిర్మాణ సంస్థతో ఉన్న ఆర్థిక సంబంధాలు, ఆ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన పారితోషికం వివరాలపైనా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
హవాలా ద్వారా డబ్బులు తీసుకున్నట్లు నిధిపై ఆరోపణలున్నాయి. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. దర్యాప్తు సంస్థ నోటీసులతో విచారణకు వచ్చారు నిధి అగర్వాల్. ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిలను ED అధికారులు ప్రశ్నించారు. త్వరలోనే మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
నిషేధిత బెట్టింగ్ యాప్స్కు సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు ఇస్తూ.. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు FIR నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ED ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తు చేపట్టింది. సెలబ్రిటీలు తీసుకున్న పారితోషికాలు, ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతోంది.
ఇది కూడా చదవండి :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.