
ప్రముఖ నటి అల్లరి సుభాషిణి.. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన సుభాషిణి ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి, సినీ ప్రస్థానం, అలాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల గురించి మనసు విప్పి మాట్లాడారు. ఆపరేషన్ తర్వాత తాను నరాల బలహీనతకు గురయ్యానని, దీనికి సంబంధించిన మందులు చాలా ఖరీదైనవని, వాటిని కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నానని ఆమె తెలిపారు. ఒకానొక సందర్భంలో 15-20 లక్షలు అవుతాయనుకున్న చికిత్స కేసీఆర్ గారి సహాయంతో రూ. 5000 రూపాయలకే పూర్తయిందని ఆమె గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం తన ఆరోగ్య సమస్యల విషయంలో ప్రముఖ యాంకర్ సుమ అందిస్తున్న సహాయం గురించి సుభాషిణి తెలిపారు. సుమ ప్రతి ఆరు నెలలకొకసారి అమెరికాలోని ఒక సంస్థ నుంచి ఆమెకు అవసరమైన ఖరీదైన మందులను ఇప్పిస్తున్నారని వెల్లడించారు. అలాగే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సుమ గురించి పలు విషయాలను పంచుకున్నారు. “సుమా తల్లి ఎలా ఉన్నావురా? బాగున్నావా? నేను హైదరాబాద్ వచ్చాను. తాజగా ఈ ఇంటర్వ్యూలో అందులో నీ గురించి చెప్పానమ్మా. నువ్వు చల్లగా నూరేళ్లు బాగుండాలి పిల్ల పాపలతో మీ కుటుంబం అంతా రాజీవ్ కనకాల గారు, మీరు, మీ కుటుంబం అంతా చల్లగా ఉండాలని నేను మనసారా ఆ దీవిస్తున్నాను రా అని తెలిపారు సుభాషిణి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నివసిస్తున్న అల్లరి సుభాషిణి, అల్లరి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారారు. సినిమాల్లోకి రాకముందు ఆమె రంగస్థలంపై ఎన్నో నాటకాలు, ముఖ్యంగా చింతామణి నాటకంలో తన అద్భుత నటనతో ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు. ఈ నాటకం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇల్లు కట్టుకోగలిగానని ఆమె సంతోషంగా గుర్తు చేసుకున్నారు. మద్రాసులో చింతామణి నాటకం ఆడుతున్నప్పుడు ప్రముఖ నటుడు చలపతిరావు గారు ఆమె నటనను చూసి సినిమాల్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత రవీంద్రభారతిలో మరో ప్రదర్శన సమయంలో చలపతిరావు గారి సూచన మేరకు రవి గారి అల్లరి సినిమా ద్వారా నరేష్తో పాటు సినీ రంగ ప్రవేశం చేశారు. ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులు కూడా ఆమె ప్రతిభను గుర్తించి తమ సినిమాలలో అవకాశాలు కల్పించారని గుర్తుచేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.