
హీరోలకు సమానంగా హీరోయిన్స్ కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. అలాగే కొంతమంది హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటూ రాణిస్తున్నారు. ఇక ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించడం అనేది కూడా చాలా కామన్. కాగా ఓ సినిమాలో హీరోయిన్స్ ఇద్దరూ పోటీపడి నటించారు. సినిమా సంచలన విజయం సాధించింది. తాజాగా ఆ సినిమా గురించి ఓ దర్శకుడు మాట్లాడుతూ.. రమ్యకృష్ణ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
దర్శకుడు కేఎస్ రవికుమార్, సూపర్స్టార్ రజినీకాంత్ కాంబినేషన్లో వచ్చిన ముత్తు, నరసింహ (తమిళంలో పడయప్ప), లింగ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వీటిలో ముత్తు, నరసింహ భారీ విజయాలుగా నిలిచాయి. అయితే, లింగ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ముఖ్యంగా, నరసింహ చిత్రంలోని రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ పాత్రకు సంబంధించిన ఆలోచన రజినీకాంత్ నుంచి వచ్చిందని కేఎస్ రవికుమార్ తెలిపారు. రజినీకాంత్ అప్పట్లో పొన్నియిన్ సెల్వన్ నవలను చదివి, దానిలోని ఒక పాత్ర నుండి స్ఫూర్తి పొంది ఒక లేడీ విలన్ క్యారెక్టర్ అవుట్లైన్ను సూచించారట. నీలాంబరి, వసుంధర వంటి పేర్లు పొన్నియిన్ సెల్వన్ నుండి వచ్చినవే అని రవికుమార్ వివరించారు.
ఈ పాత్ర చాలా మొండిగా, కఠినంగా ఉండాలని, ఆ పాత్రకు మొండితనాన్ని జోడించాలని రజినీకాంత్ సలహా ఇచ్చారట. ఈ సూచనల ఆధారంగానే నీలాంబరి పాత్రను తెరకెక్కించడం జరిగిందని రవికుమార్ స్పష్టం చేశారు. అయితే, ఈ బలమైన పాత్ర కోసం మొదట నగ్మా పేరును పరిశీలించారని, ఆ తర్వాత మీనాను కూడా పరిశీలించారని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో కేఎస్ రవికుమార్ చిరంజీవి గారితో స్నేహం కోసం సినిమా చేస్తున్నారని, ఆ చిత్రంలో మీనా హీరోయిన్గా నటించారని, తమిళ స్నేహం కోసంలో సిమ్రాన్ నటించారని గుర్తు చేసుకున్నారు. స్నేహం కోసంలో ఒక ఇంటర్వెల్ సీన్లో ఒక కన్నింగ్ లుక్ ఇవ్వాల్సి వచ్చిందని, అయితే ఆ లుక్ మీనాకు అంతగా సరిపోలేదని ఆయన అన్నారు. చివరకు రమ్యకృష్ణ నీలాంబరి పాత్రకు అద్భుతమైన న్యాయం చేసి, ఆ పాత్రను ఎవర్ గ్రీన్ చేశారని గుర్తు చేసుకున్నారు రవి కుమార్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.