
టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు డిసెంబర్ 24న కన్నుమూశారు. 78 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో తనయుడు రవిబాబు నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 1200 చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు చిత్రపరిశ్రమలతో తనకంటూ ప్రత్యేగ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతితో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి నివాళులు అర్పించారు. చలపతిరావుకు కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనయుడు రవిబాబు ఇండస్ట్రీలో నిర్మాత, దర్శకుడిగా.. నటుడిగా కొనసాగుతున్నారు. కుమార్తెలు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అయితే కుమార్తెలు వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు. అప్పటివరకు ఆయన పార్దీవ దేహాన్ని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచారు.
ఆయన ఇద్దరు కుమార్తెలు మంగళవారం రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఈరోజు ఉదయం ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. చలపతిరావు కుమారుడు రవిబాబు ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్హవించనున్నారు.
మరోవైపు ఇటీవల మరణించిన కైకాల సత్యనారాయణ, చలపతి రావు కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని కైకాల నివాసానికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. అలాగే చలపతి రావు కుటుంబసభ్యులను కూడా పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. .