AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam : పల్లెజనం బలంగా మారిన బలగం సినిమా.. తొమ్మిది ఏళ్ల తర్వాత ఒక్కటైన తోబుట్టువులు

పల్లెపల్లెనా పేదజనం గుండెలను తట్టిలేపిన బలగం సినిమాను ఊరుమ్మడిగా చూస్తున్నారు. ఇంతకాలం తమలోని అనవసర పట్టింపులూ, మొండి పట్టుదలలతో ఏం కోల్పోయామో తెలుసుకొని ఒక్కటౌతున్నారు జనం. జనగామ జిల్లాలోని ఓ అక్కాతమ్ముళ్ళ మధ్య తొమ్మదేళ్ళ ఎడబాటుని తొలగించింది బలగం

Balagam : పల్లెజనం బలంగా మారిన బలగం సినిమా.. తొమ్మిది ఏళ్ల తర్వాత ఒక్కటైన తోబుట్టువులు
Balagam
Rajeev Rayala
|

Updated on: Apr 20, 2023 | 6:27 PM

Share

పంతాలు- పట్టింపులు మనుషుల మధ్య అంతరాలు పెంచితే.. బలగం సినిమా రక్తసంబంధాల విలువను విప్పిచెప్పింది. రక్తం పంచుకుపుట్టిన బిడ్డల మధ్య అంతులేని అంతరాలు.. కట్టలు తెంచుకున్న విద్వేషంతో ఏళ్ళతరబడి విడివడి ప్రేమా ఆప్యాయతలకు నోచుకోక ఒంటరులై.. జీవిస్తోన్న మనుషులను కదలిస్తోంది.. తెలంగాణ గడ్డ మీద పుట్టిన అచ్చతెలంగాణ బలగం సినిమా. పల్లెపల్లెనా పేదజనం గుండెలను తట్టిలేపిన బలగం సినిమాను ఊరుమ్మడిగా చూస్తున్నారు. ఇంతకాలం తమలోని అనవసర పట్టింపులూ, మొండి పట్టుదలలతో ఏం కోల్పోయామో తెలుసుకొని ఒక్కటౌతున్నారు జనం. జనగామ జిల్లాలోని ఓ అక్కాతమ్ముళ్ళ మధ్య తొమ్మదేళ్ళ ఎడబాటుని తొలగించింది బలగం సినిమా. గ్రామంలో 9 ఏళ్ల క్రితం దూరమైన అక్కా తమ్ముళ్ళను కలిపింది బలగం సినిమా. ఒకే ఊళ్ళో ఉన్నా ఒకరిమొహం ఒకరు చూసుకోరు. కనీసం పన్నెత్తి మాట్లాడుకోరు. అలా దూరమైన అక్కాతమ్ముళ్ళు బలగం సినిమా చూసి..ఒకరినొకరు హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు.. ఊరు ఊరంతా ఈ అక్కాతమ్ముళ్లను సంబురంగా చూస్తున్నారు.

ఈ ఒక్క సీన్ చాలు.. బలగం సినిమా ఏ స్థాయిలో బంధుత్వంలోనూ.. ఆత్మీయ బంధాల్లోని విలువలను ఎలా తెలియజేసిందో అర్థం చేసుకోవడానికి. ఓ చిన్న విషయంలో అలిగి వెళ్లిపోయిన అక్క సుమారు 9 ఏళ్ల తర్వాత బలగం సినిమా ద్వారా దగ్గరయ్యింది.. ఒకే ఊరిలో వుంటున్నా కనీసం ఒకరిమొఖం మరొకరు చూసుకోని అక్కాతమ్ముళ్ళు బలగం సినిమా చూసి ఒక్కటయ్యారు.. ఒకరిమీద ఒకరు పడి బోరున విలపించారు.. ఈ సంఘటన జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం వనపర్తి గ్రామంలో జరిగింది..విడిపోయిన కుటుంబాలను కలిపింది. నేలమంచి వీరరెడ్డి, కొమలమ్మలకు నలుగురు సంతానం..మొదటి ఇద్దరు సంతానం ఆడపిల్లలు, యాదమ్మ,గాలమ్మ, మూడు-నాల్గవ సంతానం భూపాల్ రెడ్డి, పద్మారెడ్డి.. పద్మరెడ్డి వృతి రిత్య హైదరాబాద్ లో స్థిర పడ్డాడు.

తొమ్మిది సంవత్సరం క్రితం గాలమ్మ చిన్న కొడుకు పెండ్లి జరిగింది.. సాంప్రదాయం ప్రకారం పుట్టింటి ఆడపడుచులకు బియ్యం సారెపోసే కార్యక్రమం వుండగా ఇద్దరు అన్నదమ్ములు అనివార్య కారణాల రిత్యా ఆ కార్యక్రమం చేపట్ట లేదు.. దీంతో మనస్పర్ధలు పెరిగాయి.. బంధాలు దూరమయ్యాయి..అంతరాలు పెరిగిపోయి మాటలు, చుట్టరికం కూడా తెగిపోయింది.. కనీసం ఆ పెళ్లి వేడుకలో భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయారు.. అప్పటి నుంచి ఈ నాలుగు కుటుంబాల మధ్య ఎడబాటు అలాగే కొనసాగుతుంది.. ఒకే ఊరిలో ఉంటున్నా.. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లారు.. అక్కల ఇండ్లలోకి తమ్ముళ్ళు..తమ్ముళ్ళ ఇండ్లలోకి అక్కాలు ఎలాంటి శుభకార్యాలు జరిగినా ఆహ్వానం ఉండదు.. చిన్న మనస్పర్ధ 9 ఏళ్ల ఎడబాటుకు కారణమైంది.

రెండు రోజుల క్రితం ఈ గ్రామ సర్పంచ్ శ్రీధర్ గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర ప్రొజెక్టర్ పెట్టి బలగం సినిమా ప్రదర్శించారు. ఈ సినిమాను భూపాల్ రెడ్డి – అతని అక్కాలు యాదమ్మ, గాలమ్మలతో సహా ఊరంతా వీక్షించారు.. సినిమా చూసిన రెండు రోజుల తర్వాత భూపాల్ రెడ్డి గ్రామ దేవతలా పండుగ చేసుకునే క్రమంలో పంతాలు పక్కనపెట్టి తన అక్కలు యాదమ్మ,గాలమ్మల ఇంటికి వెళ్ళాడు.. 9 ఏళ్ల తర్వాత తన గడప దాటి ఇంట్లో అడుగుపెట్టిన తమ్ముడిను చూడగానే ఆ అక్క కళ్లలో నుండి కన్నీళ్లు ఉబికి వచ్చాయి.. అక్క-తమ్ముడు ఒకరినొకరు హత్తుకొని ఆనందంతో ఉప్పొంగి పోయారు..అక్కను పండుగకు ఆహ్వానించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. భార్య దేవేంద్రతో భూపాల్ రెడ్డి వెళ్లి బొట్టు పెట్టి పలకరించాడు.. ఆప్యాయంగా అక్క యాదమ్మ ఇంట్లోకి తీసుకువెళ్ళింది..

అక్కను చూసిన తమ్మ్దుడు భూపాల్ రెడ్డి అమాంతం కాళ్ళ మీద పడి అక్కమనసు గెలుచుకున్నాడు తమ్ముడు. ఈ దృశ్యం ఆ ఇంటిల్లిపాదినీ కంటతడిపెట్టించింది. ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అంతే కాదు వీళ్ళిద్దరి మరో అక్క గాలమ్మ ఇంటికి కూడా వెళ్లి ఆహ్వానం పలికారు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది.. ఆనంద భాష్పాలు పెల్లుబికాయి. ముడుచుకున్న మనసులు పురివిప్పిన నెమలిలా ఆనందంతో నిండిపోయాయి. తొమ్మిది ఏళ్ల తర్వాత ఒక్కటైన ఈ రెండు కుటుంబాల ముచ్చట ఇప్పుడు ఊరంతా చర్చగా మారింది.