
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరడు గట్టిన విలన్ పాత్రల్లో ఒదిగిపోయి నటులు చాలా మందే ఉన్నారు. అందులో సత్య ప్రకాశ్ ఒకరు. తన భయంకరమైన విలనిజంతో ‘సైకో సత్య’గా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారాయన. రూపు చూస్తే సత్య ప్రకాశ్ ఉత్తరాది వారేమో అనుకుంటారు చాలా మంది. కానీ ఆయన మన తెలుగు వాడే. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో పుట్టారు. అయితే ఒడిశాలో పెరిగాడు. కెరీర్ ప్రారంభంలో కొద్దిరోజుల పాటు ఓ బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి ఉండడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అన్నట్లు సత్య ప్రకాశ్ అసలు పేరు ‘ వెంకట సూర్య సత్యనారయణ సోమయాజులు ప్రసాద్’. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తున్నాడు సత్య అలాగే కొన్ని సినిమాల్లో విలన్ గానూ నటిస్తున్నారు. కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి.
సత్య ప్రకాష్ తన కెరీర్ బిగింగ్ లో ఎదురైన కఠినమైన పరిస్థితులను, అవమానాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చెన్నై నుండి కేవలం రెండు వేల రూపాయల జీతంతో ఒక షూటింగ్ నిమిత్తం హైదరాబాద్కు రైలులో వచ్చానని ఆయన అన్నారు. ఆ సమయంలో, కేవలం రెండు వందల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి మిగిలిన మొత్తం తర్వాత ఇస్తామని చెప్పారు. టికెట్ ఉన్నప్పటికీ, రైలులో సరిగా కూర్చోవడానికి కూడా స్థలం లేక బాత్రూమ్ పక్కన కూర్చుని ప్రయాణించానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్లో భోజన సమయంలో కేవలం రెండు ఇడ్లీలు, ఒక వడ మాత్రమే ఇచ్చారు. ఆ రోజుల్లో మంచి ఫిట్గా ఉన్న సత్య ప్రకాష్కు ఆ టిఫిన్ సరిపోకపోవడంతో, ప్రొడక్షన్ వ్యక్తిని మరో ఇడ్లీ అడిగితే అతను.. అంతే, ఇంకేం లేవు అన్నాడట. ఆ సంఘటన తనకు చాలా బాధ కలిగించిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఒక ఫైట్ సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు, సుమన్, భానుచందర్, అరుణ్ పాండియన్ వంటి హీరోలు ఉన్న ఆ సెట్లో సత్య ప్రకాష్ సరిగా ఫైట్ చేయలేకపోయారు. దీనితో ఫైట్ మాస్టర్ “ఇతనికి రావడం లేదు, వేరే ఆర్టిస్ట్ని పెట్టండి” అని చెప్పి ఆయన్ని బయటకు పంపించేశారట. ఆ సమయంలో ఒక కో-డైరెక్టర్ పక్కనే నిలబడి స్మోక్ చేస్తూ, ” ఓ బుతూ వాడుతూ.. దరిద్రపు నా కొడుకులంతా కూడా ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. అందుకే ఇండస్ట్రీ ఇలా అవుతోంది” అనిదారుణంగా అవమానించాడట. ఆయన కో-డైరెక్టర్ కావడం వల్ల తాను ఏమీ చెప్పలేకపోయానని సత్య ప్రకాష్ గుర్తు చేసుకున్నారు.
అయితే, 12 సంవత్సరాల తర్వాత చక్రం తిరిగింది. తాను నటుడిగా నిలదొక్కుకొని తన క్యారవాన్లో కూర్చుని ఉండగా, అదే కో-డైరెక్టర్ ఒక డైలాగ్ అందించడానికి తన వద్దకు వచ్చారు. అప్పుడు సత్య ప్రకాష్ ఆయన్ని తన క్యారవాన్లోకి పిలిచి, 12 ఏళ్ల క్రితం ఆయన తనను అవమానించిన తీరును గుర్తు చేశారు. “మీరు అప్పుడు కో-డైరెక్టర్, ఇప్పుడు కూడా కో-డైరెక్టరే. కానీ నా స్థానం మారింది. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారిని అలా తిట్టకండి సార్. ఎన్నో ఆశలతో వస్తారు” అని విన్నవించారు. సినిమా రంగంలోకి రావాలనుకునే యువతకు సత్య ప్రకాష్ ఒక సందేశాన్ని ఇచ్చారు: “ఎన్ని మాటలు అన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా వాటిని విని తప్పు దారి పట్టకండి, వెనక్కి వెళ్ళకండి. మీరు మీలాగే ఉండండి. ప్రపంచం మీ దగ్గరకు వస్తుంది. మీరు సాధించాలనుకున్నది సాధించండి. ఈరోజు కాకపోయినా రేపైనా ప్రపంచం మిమ్మల్ని సెల్యూట్ చేస్తుంది.” చీకట్లో ఉన్నప్పుడు నీడ కూడా తోడు ఉండదని, కానీ వెలుగులో ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారని సత్యప్రకాష్ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.