
Prashanth neel: కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. బాహుబలి తర్వాత సౌత్ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందీ సినిమా. దీంతో ప్రశాంత్ నీల్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగింది. దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ కన్నడ స్టార్ డైరెక్టర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోనే అని మీలో ఎంత మందికి తెలుసు.? అవును.. ప్రశాంత్ నీల్ స్వస్థలం ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా నీలకంఠాపురం. అంతేకాదు కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీర రెడ్డి ప్రశాంత్ నీల్కు చిన్నాన్న అవుతాడు.
నీలకంఠాపురం పాఠశాలలో సోమవారం జరిగిన 75వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రశాంత్ నీల్, చిన్నాన్న రఘువీరారెడ్డితో కలిసి పాల్గొన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి నిర్మించిన నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, నీలకంఠాపురం గ్రామంలో నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి సందర్శించారు. ప్రశాంత్ నీల్ను చూసేందుకు నీలకంఠాపురం గ్రామస్తులతోపాటు కర్నాటక సరిహద్దు గ్రామాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Prashanth Neel
ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘సినిమాల్లో నేను ఎంత గొప్పవాడినైనా.. నా మరణం అనంతరం నీలకంఠాపురంలోని మా నాన్న సమాధి పక్కనే నా సమాధి ఉంటుంది. మా నాన్న జయంతి ఇదే రోజు కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్తో సలార్ సినిమా షూటింగ్ చేస్తున్నాను, వచ్చే ఏడాది మే నెలలో జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ప్రారంభించనున్నాము’ అని చెప్పుకొచ్చారు. ఇక ప్రశాంత్ మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు తన పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠాపురం అని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..