Elections 2024: సోమవారం లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్.. పోటీలో ఉన్న ప్రముఖులు వీరే
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు భారీ ఏర్పాట్లు చేసింది ఈసీ. 10 రాష్ట్రాల లోని 96 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. యూపీ మాజీ సీఎం అఖిలేశ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా , అధిర్రంజన్ చౌదరి , యూసఫ్ పఠాన్ లాంటి ప్రముఖుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయి
![Elections 2024: సోమవారం లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్.. పోటీలో ఉన్న ప్రముఖులు వీరే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/lok-sabha-elections-2024-1.jpg?w=1280)
లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు సర్వం రెడీ అయ్యింది. సోమవారం 10 రాష్ట్రాల లోని 96 ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది. బిహార్లో 5 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 55 మంది పోటీలో నిలిచారు. జమ్మూకాశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి 24 మంది పోటీపడుతున్నారు. జార్ఖండ్లోని 4 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 45 మంది పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్లోని 8 పార్లమెంటు స్థానాలకు గానూ 74 మంది పోటీపడుతున్నారు.
మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానాలకు 37 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని 13 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 130 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక పశ్చిమ బెంగాల్లో 8 స్థానాల్లో 75 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
నాలుగో దశలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు క్రికెటర్లు, ఒక నటుడు సహా 1717 మంది అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది. యూపీ లోని కన్నౌజ్ ఎంపీ స్థానం నుంచి అఖిలేశ్యాదవ్ బరిలో ఉన్నారు. బెంగాల్ లోని కృష్ణానగర్ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్ధిగా మహువా మొయిత్రా పోటీ చేస్తున్నారు. ప్రశ్నకు నోటు కేసులో ఆమెను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. మహువాపై కృష్ణానగర్ రాజకుటుంబానికి చెందిన అమృతారాయ్ బరిలో ఉన్నారు.
బెంగాల్ లోని బెహ్రాంపూర్లో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. కాంగ్రెస్ , టీఎంసీ,బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్ధిగా అధిర్రంజన్ పోటీ చేస్తున్నారు. అధిర్రంజన్కు మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ టీఎంసీ నుంచి సవాల్ విసురుతున్నారు. అధిరంజన్ చౌదరిని ఎలాగైనా ఓడించాలన్న కసిలో మమతా బెనర్జీ ఉన్నారు. అందుకే ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో యూసఫ్ పఠాన్ను బరి లోకి దించారు. బెంగాల్లో ఇండియా కూటమి విచ్చిన్నం కావడానికి అధిర్రంజన్ తీరే కారణమని టీఎంసీ నేతలంటున్నారు.
బిహార్ లోని బెగుసరాయ్ నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ ఉంది. కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్పై ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్ధిగా సీపీఐ మాజీ ఎమ్మెల్యే అవదీశ్ రాయ్ బరిలో ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…