వరకట్న వేధింపులతో మూడేళ్ల కూతరుతో సహా మహిళ ఆత్మహత్య
వరకట్న పిశాచికి మరో అబల బలైంది. అత్తింటి వేధింపులు తాళలేక మూడేళ్ల కూతరుతో సహా బలవన్మరణానికి పాల్పడింది.
వరకట్న పిశాచికి మరో అబల బలైంది. అత్తింటి వేధింపులు తాళలేక మూడేళ్ల కూతరుతో సహా బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామ శివారు చెరువులో తేలియాడుతున్న మృతదేహాలను చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
భదోహి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వినోద్ చౌహాన్, సులేఖ (26) దంపతులకుమూడేండ్ల కూతురు సోనాలితో కలిసి ఉంటున్నారు. అయితే, గ్రామ శివారులోని చెరువులో సులేఖతో పాటు మూడేళ్ల కూతురు సోనాలి శవమై కనిపించారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసిన దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతికి వరకట్న వేధింపులే కారణమని ప్రాథమిక విచారణలో నిర్ధారించారు పోలీసులు. తన కూతురు, మనుమరాలు మృతికి అల్లుడు వినోద్ చౌహాన్, అతని తల్లిదండ్రులు, మరిది కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. మృతురాలి భర్త, అత్త, మామ, మరిదిలను అరెస్ట్ చేశారు.
తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అత్తింటి వారే తన కూతురు, మనుమరాలును గొంతు పిసికి చంపి చెరువులో పడేశారని మృతురాలి తండ్రి ఆరోపించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.