ఇప్పుడే వస్తామంటూ బయటకు వెళ్లిన యువకులు.. రెండు రోజులకు విగతజీవులుగా చెట్లకు వేలాడారు.. తేల్చే పనిలోపడ్డ పోలీసులు
ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు స్నేహితులు అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించారు.
Friends suspected death : రెండు రోజుల క్రితం కనిపించుకుండాపోయిన ఇద్దరు స్నేహితులు విగతా జీవులుగా మారారు. హైదరాబాద్ మహానగర శివారులో వెలుగచూసిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన ఇద్దరు స్నేహితులు అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ శివారులోని గాజులరామారం గ్రామానికి చెందిన బండోజి సత్యనారాయణ కుమారుడు సాయికుమార్ (22) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 6గంటలకు కొంచెం సేపటిలో వస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. చీకటి పడుతున్నా కొడుకు ఎంతకీ తిరిగి రాకపోవడంతో సత్యనారాయణ అతని అచూకీ కోసం వివిద ప్రాంతాల్లో వెతికాడు. ఇంతలో సంజయ్గాంధీనగర్కు చెందిన నరేష్ (22) ఫోన్ చేసి ‘మీ కొడుకు సాయికుమార్ నా తోనే ఉన్నాడు’ అని చెప్పి కొద్దిసేపట్లో ఇంటికి వస్తామని ఫోన్ కట్ చేశాడు. అటు, నరేష్ కూడా తన తల్లికి ఫోన్చేసి అరగంటలో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. ఇంతలో నరేష్ ఫోన్ స్విచాఫ్ అయ్యింది. తెల్లవారినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఇద్దరి యువకుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
ఇదిలావుండగా, మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో లాల్సాబ్గూడ ఫారెస్ట్ ఇద్దరు యువకుల మృతదేహాలు చెట్టుకు వేలాడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని ఈనెల 10వ తేదీ నుంచి కనిపించకుండాపోయిన సాయికుమార్, నరేషగా గుర్తించారు. వారిద్దరు చీరలతో ఉరేసుకుని వేర్వేరు చెట్లకు వేలాడుతూ కనిపించారు. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.