ఢిల్లీ పోలీసులపై మూకదాడి.. ఓ పోలీస్ అధికారిపై కాల్పులు..
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కాల్పుల కలకలం రేగింది. ఇంద్రలోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు దుండగులు పోలీసులపైనే లాఠీలతో దాడికి దిగతూ రాళ్లు విసిరారు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కాల్పుల కలకలం రేగింది. ఇంద్రలోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు దుండగులు పోలీసులపైనే లాఠీలతో దాడికి దిగతూ రాళ్లు విసిరారు. అంతేకాదు ఓ దుండగుడు సబ్ ఇన్స్పెక్టర్పై ఓ రౌండ్ కాల్పులు కూడా చేశాడు. దీంతో అప్రమత్తమైన సదరు ఎస్సై ఆత్మ రక్షణలో భాగంగా రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు కూడా జరిపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రలోక్లోని పోలీస్ స్టేషన్కు ఓ వ్యక్తి వచ్చి.. తన షాపులో కొందరు వ్యక్తులు లూటీ చేశారని.. అంతేకాకుండా తనపై దాడికి కూడా పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫిర్యాదుదారుడి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకొన్నారు. అయితే వారిని విచారించేందుకు ప్రయత్నించగా పోలీసులపైకి ఎదురు తిరిగారు. దీంతో వారిని పోలీస్ పోస్ట్ వద్దే నిర్భందించారు.
అయితే కాసేపటికి పెద్ద ఎత్తున కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి పోలీసులపై మూక దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి దిగడమే కాకుండా.. దుండగుల్లో ఓ వ్యక్తి పోలీస్ పైకి షూట్ కూడా చేశాడు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారికి గాయమవ్వగా.. మరికొందరు సిబ్బంది కూడా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సడ్కీన్, అష్కీన్, షారూఖ్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు ఈ ఘటనలో ప్రధాన నిందితులని.. కాల్పులకు దిగిన వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డామని.. త్వరలోనే మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.