కరోనా సృష్టిస్తున్న విలయంతో వలస కూలీల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సామాన్యుల దయనీయ గాథలు సభ్య సమాజాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన దంపతులు స్వస్థలానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. అందుకోసం ఆ ఇల్లాలు చేసిన సాహాసం అంతాఇంతా కాదు..500 కిలోమీటర్ల దూరం పాటు నడిచేందుకు సాహసించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఒడిశా రాష్ట్రం, మల్కాన్ గిరి జిల్లాకు చెందిన శ్రీదామ్శీల్, సునితశీల్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు కలిసి ఆరు నెలల క్రితం ఉపాధి కోసం కూలీ పనుల నిమిత్తం హైదరాబాద్కు వచ్చారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయగా, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మే 7 వరకు లాక్డౌన్ ప్రకటించారు. దీంతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని భావించిన వలస కూలీలకు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి చేరుకోవాలని ఆ దంపతులు, కుటుంబం భావించింది. ఈ మేరకు పాదయాత్రను నమ్ముకున్నారు. హైదరాబాద్ నుంచి ఓడిశాకు సుమారు 500 కిలోమీటర్ల దూరం పాటు నడిచేందుకు సాహసించారు. ఏప్రిల్ 10న ప్రయాణమైన ఆ కుటుంబ సభ్యులు, ఏప్రిల్ 21 రాత్రి సమయానికి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చేరారు. దీంతో కూసుమంచి పోలీసులు ఆ కుటుంబాన్ని గుర్తించి అన్నం ట్రస్టుకు పంపించారు.
హైదరాబాద్ పనుల కోసం వచ్చి ఒడిశాకు వెళ్తున్న వసల కూలీల్లో సునితశీల్ 9 నెలల నిండు గర్భిణి. స్వగ్రామం చేరుకోవాలనే ఆలోచన తో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర చేసింది. హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తున్న ఆమె సుమారు 200 కిలోమీటర్ల దూరం నడిచింది. ఇంకా 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి ఓడిశాకు వెళ్తున్న వలస కూలీలను కూసుమంచి పోలీసులు గుర్తించి ఆరా తీయగా, విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు. తక్షణ మే వారందరికీ భోజనాలను ఏర్పాటు చేశారు. అనంతరం వారిని అన్నం ట్రస్టుకు తరలించారు. స్థానిక పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలోబాధితురాలిని ఆసుపత్రికి పంపించేందుకు ఎస్ఐ చర్యలు తీసుకుంటున్నారు. కావాల్సిన ఆర్థిక సాయం కూడా పోలీసులే అందజేశారు.