కరోనా వీరవిహారం..ఒకే ఇంట్లో 19 మందికి పాజిటివ్
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. రోజుకు వందకు పైగా పాజిటివ్ కేసులతో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి వైరస్ సోకింది.

తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. రోజుకు వందకు పైగా పాజిటివ్ కేసులతో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి వైరస్ సోకింది. స్థానిక పట్టణానికి చెందిన ఓ మహిళ(55) అనారోగ్యం బారినపడగా..హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ జూన్ 9న ఆమె ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన రోజు రాత్రే జహీరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందే ఆమెకు కోవిడ్ టెస్టులు చేయగా.. మరుసటి రోజు సాయంత్రం పాజిటివ్ అని రిపోర్ట్స్ లో తేలింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు మృతురాలి కుటుంబీకులు, బంధువులను ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. 25 మందికి కరోనా టెస్టులు చేయగా.. 19 మందికి పాజిటివ్ అని శుక్రవారం రాత్రి రిపోర్ట్ వచ్చింది. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా సోకిన వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న దాదాపు 40 మంది వివరాలను సేకరిస్తున్నారు. వారిని హోం క్వారంటైన్లో ఉంచి పర్యవేక్షించనున్నారు. కరోనాతో మహిళ మృతి చెందిన ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో రాకపోకలపై నిషేధం విధించారు.




