కరోనా పాజిటివ్ వ్యక్తికి 67 మందితో కాంటాక్ట్ !
శ్రీకాకుళం జిల్లాలో బయటపడ్డ కొత్త కేసులు అధికార యంత్రాంగాన్ని మరింత ఆందోళనలో పడేసింది. వారితో కాంటాక్ట్లో ఉన్నవారిని గుర్తించే క్రమంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రరాష్ట్రాన్ని కరోనా హడలెత్తిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని ఏపీ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1016కు చేరుకుంది. ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో బయటపడ్డ కొత్త కేసులు అధికార యంత్రాంగాన్ని మరింత ఆందోళనలో పడేసింది. కొత్తగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్లో ఉన్నవారిని గుర్తించే క్రమంలో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
ఇంతవరకు కరోనా నుంచి దూరంగా ఉంటూ వస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఒక్కసారిగా మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. పాతపట్నం మండలంలో ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రాంతంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఆ ప్రాంతాన్ని సంపూర్ణ లాక్ డౌన్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు. కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కాగా, వీరిలో ఒక వ్యక్తికి 67 మందితో కాంటాక్ట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడితో సన్నిహితంగా మెలిగే వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే 29 మందిని గుర్తించి వారందరినీ క్వారంటైన్ కి తరలించారు. ఈ ముగ్గురు ఇంకా ఎంతమందికి వైరస్ అంటించి ఉంటారనే అంశం ఇప్పుడు అధికారులతో పాటు, జిల్లా వాసులను భయపెడుతోంది.