హైదరాబాద్లో సిద్ధమవుతున్న “థీమ్” పార్కులు
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా థీమ్ పార్కులను అభివృద్ధి చేస్తోంది....

హైదరాబాద్ అంటేనే మనందరికి టక్కున గుర్తొచ్చేది చార్మినార్, హైటెక్ సిటీ. అంతలా ఈ కట్టడాలు నగరానికి గుర్తింపు తెచ్చాయి. అయితే ఇప్పుడు అదే కోవలోకి మరిన్ని కూడా చేరుతున్నాయి. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఈ థీమ్ పార్కులను సిద్ధం చేస్తోంది. నగరంలో మొత్తం 12 థీమ్లతో 50 పార్కులను అభివృద్ధి చేస్తున్నది. వీటిలో ఐదు పార్కుల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ 50 పార్క్లను రూ.120 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెలాఖరుకు టెండర్ల ప్రక్రియ పూర్తయి.. వచ్చే నెలలో మెజార్టీ పార్కుల్లో పనులు వేగం అందుకుంటాయని అధికారులు పేర్కొన్నారు.
ఎంపిక చేసిన 50 పార్కుల్లో శేరిలింగంపల్లి సర్కిల్లో రెండు, కూకట్పల్లి జోన్లో ఒక ప్రాంతం మార్పునకు సంబంధించిన ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీ ఇప్పటికే ఆమోదించింది. సందేశాత్మక, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా పార్కుల థీమ్లు ఉండేలా వాటిని ప్లాన్ చేస్తున్నారు.