
హైదరాబాద్, మే 3: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డు కీలక అప్డైట్ జారీ చేసింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మే 2వ తేదీతో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల గడువు ముగిసింది. విద్యార్ధుల అభ్యర్ధన మేరకు ఆ గడువును మే 4వ తేదీకి పొడిగించారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా సూచించారు. ఫీజులను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా చెల్లించాలని ఆమె సూచించారు.
ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్ధులతోపాటు తక్కువ మార్కులు స్కోర్ చేసిన విద్యార్ధులు కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అప్లై చేసుకోవచ్చు. కాగా మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల హెడ్యూల్ను కూడా విడుదల చేసింది. రోజుకు రెండు పూటలా పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్ విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతాయి. జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష జూన్ 10న ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. ఇక ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది.
ఇక మరోవైపు తెలంగాణ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.